ఆ కృష్ణా టీడీపీ నేత పార్టీలో ఉంటాడా... వెళతాడా...!
తెలుగుదేశం పార్టీ పోగొట్టుకున్న అత్యంత బలమైన నియోజకవర్గాల్లో పెనమలూరు కూడా ఒకటి. ఆ పార్టీకి అండగా ఉన్న కమ్మ సామాజిక వర్గం బలంగా ఉన్న నియోజకవర్గం పెనమలూరు. కార్యకర్తల బలం కూడా ఈ నియోజకవర్గం లో చాలా ఎక్కువ. ఉన్న మూడు మండలాల్లో కూడా కమ్మ సామాజిక వర్గ ఓట్లు చాల ఎక్కువ. ఇక పార్టీకి అండగా ఉండే బీసి సామాజిక వర్గాలు కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కువగానే ఉన్నాయి. ఇక పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అభివృద్ధి కూడా ఇక్కడ ఎక్కువగానే జరిగింది అనేది వాస్తవం.
కాని దానిని అప్పుడు ఎమ్మెల్యే గా ఉన్న బోడె ప్రసాద్ వాడుకోలేకపోయారు. 2014 ఎన్నికల్లో భారీ మెజారిటి తో అసెంబ్లీ కి ఆయన్ను పంపినా సరే తర్వాతి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఈ యేడాది ఎన్నికల్లో ఎవ్వరూ ఊహించని విధంగా బోడే మాజీ మంత్రి పార్థసారథి చేతుల్లో ఏకంగా 10 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు పార్టీ నియోజకవర్గంలో ఇబ్బంది పడుతుంది.
బలమైన క్యాడర్ ఉండి కూడా వాళ్ళను నడిపించే సమర్ధత ఉన్న నాయకుడు నియోజకవర్గంలో లేరు. ఆయన మనిషిగా టీడీపీలో ఉంటున్నా.. మనసంతా బయటకు వెళదామా ? పార్టీకి భవిష్యత్తు లేదా ? అన్నట్టుగా ఉందట. అటు పార్టీని వీడిన వంశీ లాంటి వాళ్లతో టచ్లో ఉండడంతో పార్టీ కేడర్ కూడా బోడేను అనుమానిస్తోంది. అందుకే ఇప్పుడు అయన ఎక్కడికి అయినా వెళ్ళినా సరే పట్టించుకోవడం లేదనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి.
నియోజకవర్గంలో ఏదైనా సమావేశం ఉందని ఆయన పిలిచినా సరే కార్యకర్తలు గాని స్థానిక నాయకులు గాని ఆయన వంక చూడటం లేదని అంటున్నారు. నియోజకవర్గంలో ఆయన వ్యతిరేక వర్గానికి ఓటమి ఉపయోగపడింది. ఆయన వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు ఆయనకు దూరంగానే ఉంటున్నారు. అందుకే బోడె పార్టీ కూడా మారాలనే యోచనలో ఉన్నట్టు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.