బెంగళూరులో దారుణం: భార్యకు మద్యం తాగించి... స్నేహితులతో ఘోరమైన పని చేసిన భర్త
కలకాలం తోడుంటానని అగ్నిసాక్షిగా వివాహమాడిన భర్త...కాలయముడయ్యాడు.. కారులో షికారుకు వెళ్దామని చెప్పి బయటకి తీసుకెళ్లిన భర్త ఆ తర్వాత బలవంతంగా భార్యకు మద్యం తాగించాడు.. ఆమె మత్తులో ఉందని నిర్ధారించుకున్నాక కారు రన్నింగ్లో ఉండగ బయటకి తోసేసాడు. చనిపోలేదని అనుమానం కలిగి మళ్లీ అదే కారుతో తొక్కించి చంపేశాడు. ఈ దారుణ సంఘటన బెంగళూరులో నవంబర్ 16న జరగగా బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
27 ఏళ్ల తేజ్సింగ్, భార్య దీపల్ కంవార్ (27)లు రాజస్థాన్కు చెందిన దంపతులు. వీరికి బెంగళూరులో చిన్న బంగారం దుకాణం ఉంది. హొణిసేమారనహళ్లి వద్ద జనతా కాలనీలో వీరు నివాసం ఉంటున్నారు. అయితే కొంతకాలంగా దంపతులిద్దరి మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. కుటుంబసభ్యులు సర్దిచెప్పినా పరిష్కారం లభించడం లేదు. దీంతో తన భార్య పీడను విరగడయ్యేలా చేసుకోవాలని భావించిన తేజ్సింగ్ ఆమెను చంపడం ఒక్కటే అందుకు పరిష్కారమని నిర్ణయించుకున్నాడు.
అందుకు పక్కాప్లాన్ రూపొందించుకుని నవంబర్ 16న షికారుకు వెళ్దామని భార్యకు చెప్పి స్నేహితుడి గురుప్రీత్ సింగ్ పేరుతో కారు అద్దెకు తీసుకున్నాడు. అనంతరం భార్య, స్నేహితుడు శంకర్ సింగ్, భరత్ సింగ్తో కలిసి అమృతహళ్లి సమీపంలోని హోటల్కు వెళ్లి రాత్రి భోజనం చేశారు. స్నేహితులతో కలసి మద్యం సేవించిన తేజ్సింగ్, తన భార్యకు కూడా బలవంతంగా మద్యం తాగించాడు.
ఆ తర్వాత స్నేహితులను వారి ఇంటి వద్ద విడిచి రాత్రి 12.20 గంటలకు భార్యను దేవనహళ్లి రోడ్డుకు తీసుకెళ్లాడు.
మద్యం మత్తులో నిద్రలోకి జారుకున్న భార్యను బచ్చళ్లి గేట్ సమీపంలో నడుస్తున్న కారులో నుంచి బయటకు తోసి, కారుతో తొక్కించి హత్య చేశాడు. ఈసంఘటన జరిగిన నాటి నుంచి ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతూ వచ్చాయి. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు తేజ్సింగ్ చేసిన ప్రయత్నం విఫలమైంది. అతడిపై నిఘా ఉంచిన పోలీసులు కాల్డేటా..సంభాషణలు, సీసీ ఫుటేజీల ఆధారంగా అదుపులోకి తీసుకుని విచారించడంతో భార్యను తానే హత్య చేసినట్లు నేరం అంగీకరించాడు.