162 మంది ఉన్నారు.. కానీ, అనుమానమే..!!
మహారాష్ట్ర రాజకీయాలు మహా రంజుగా సాగుతున్నాయి. ఒకవైపు ఉత్కంఠగా ఉన్నట్టుగా కనిపిస్తాయి మరోవైపు పెద్దగా ఏమి జరగనట్టుగా ఉంటాయి. వేటికవే ఏమి జరగనట్టుగా ఏమి తెలియనట్టుగా ఉంటున్నాయి. ఇలా వేటికవి జరగనట్టుగా పెద్దగా ఏమి లేనట్టుగా ఉండటంతో ఏం జరుగుతున్నదో ఎవరికీ అర్ధం కావడం లేదు. ఇదిలా ఉంటె, రాత్రి హయత్ హోటల్ లో 162 మంది ఎమ్మెల్యేలు పరేడ్ నిర్వహించారు.
దీని ద్వారా తమకు 162 మంది సపోర్ట్ ఉన్నదని చెప్పకనే చెప్పారు. సరే అంతా బాగుంది. 162 మంది ఉన్నా ఇంకా శివసేన, ఎన్సీపీలకు అనుమానంగానే ఉన్నది. వీరంతా తమవైపే ఉంటారా అన్నది అనుమానం. అందరిచేత ఎలాంటి ప్రలోభాలకు లొంగమని, దేనికి ఆశించమని ప్రమాణం చేశారు. రాజకీయాల్లో ఇలాంటి ప్రమాణాలు చెల్లవు కదా. రాజకీయాల్లో కావాల్సింది లాభం. పెట్టిన డబ్బు తిరిగి ఎలా వస్తుంది అని చూస్తారుగాని, విలువలు చూసే రోజులు ఎక్కడ ఉన్నాయి.
ఇప్పుడు ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ పార్టీల్లో విజయం సాధించిన చాలా మంది ఎమ్మెల్యేలలో అజిత్ పవార్ సపోర్ట్ తోనే గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఆర్థికంగా వాళ్లకు అయన సహకారం అందించారు. అందులో సందేహం అవసరం లేదు. ఇప్పుడు వీళ్లంతా ఆ మూడు పార్టీలతో కలిసి ఉన్నా.. రేపటి రోజున శరద్ పవార్ కు అనుకూలంగా ఓటు వేస్తామని చెప్పడానికి వీలులేదు. హోటల్ లో కూర్చోపెట్టి ఇంతమంది ఉన్నారు అని చెప్పినా ఎవరూ పట్టించుకోరు.
బలనిరూపణ అన్నది అసెంబ్లీలోనే జరగాలి. అటు ముఖ్యమంత్రి ఫడ్నవీస్ సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఒకవైపు హడావుడి జరుగుతున్నా.. ఫడ్నవీస్ నిన్నటి రోజున ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించి చెక్ పై సంతకాలు చేస్తూ బిజీ అయ్యారు. అజిత్ పవార్ కూడా బిజీ అయ్యారు. ఈ ఇద్దరు నేతలు ఇలా సైలెంట్ గా పనులు చేసుకుంటూ పోతున్నారు. దీంతో తెరవెనుక ఏదో జరుగుతుందనే అనుమానం అందరికి ఉన్నది. ఆ అనుమానం ఏంటి అన్నది తెలియాలంటే.. బలనిరూపణ వరకు ఆగాల్సిందే.