టీ కప్పులో తుఫాను...జగన్ను కలిసి వివరణ ఇచ్చిన రఘురామ
వైఎస్ఆర్సీపీ నేత, నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు సృష్టించిన కలకలానికి ఫుల్ స్టాప్ పడింది. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా లోక్సభలో రఘురామ కృష్ణంరాజు మాట్లాడారని రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాలు వైసీపీని టార్గెట్ చేశాయి. మరోవైపు ఈ ఘటన జరిగిన మరుసటిరోజే, రాజ్యసభనుంచి తన ఛాంబర్కు వెళుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సెంట్రల్ హాల్లో ఎదురైన రఘురామకృష్ణం రాజును ”రాజుగారూ బాగున్నారా” అంటూ ఆప్యాయంగా పలుకరించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని మాత్రమే పలుకరించే ప్రధాని నరేంద్రమోడీ ఎంపీ రఘురామ కృష్ణంరాజును ఆప్యాయంగా పలుకరించడం, ఇది జరిగింది పార్లమెంటులో ముఖ్యమంత్రి జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా రఘురామకృష్ణంరాజు స్పందించిన తర్వాతే కావడంతో...కలకలం రేగింది. ఇంతేకాకుండా...ఎంపీ, బీజేపీ నేత సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ..కొందరు ఎంపీలు తమతో టచ్లో ఉన్నారని ప్రకటించడం...ఈ వేడిని మరింత పెంచింది.
దీంతో...వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి, లోక్సభ పక్ష మిథున్ రెడ్డితో కలిసి అమరావతిలో సీఎం జగన్తో సమావేశమైన రఘురామకృష్ణంరాజు తాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడలేదని వివరణ ఇచ్చారు. పార్లమెంట్లో ప్రధాని మోదీ..తనను పలకరించడం, ప్రధానికి నమస్కరిండం గురించి రఘురామ కృష్ణంరాజు స్పందిస్తూ... ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తిని గౌరవించిన అంశంగా చూడాలని అన్నట్లు సమాచారం.
సీఎం జగన్తో భేటీ అనంతరం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ...పార్లమెంట్లో తెలుగు భాషపై మాట్లాడిన దానిపై తనంత తానుగా సీఎంకు వివరణ ఇచ్చానన్నారు. ప్రధాని మోడీతో తనకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని, ఆ చొరవతోనే తనను పలకరించారే తప్ప.. వేరే రాజకీయ అంశాలేవీ లేవన్నారు. తాను పార్టీ లైన్ ఎక్కడా దాటలేదని ఎంపీ రఘురామ కృష్ణంరాజు అన్నారు. సుజనా చౌదరితో ఏ వైసీపీ నేతా టచ్లో లేరని, సుజనా ఎందుకలా మాట్లాడారో ఆయననే అడిగి తెలుసుకోవాలన్నారు. నిజంగా ఎవరైనా టచ్లో ఉంటే వారి పేర్లు చెప్పాలని ఎంపీ కృష్ణం రాజు డిమాండ్ చేశారు.