ఎన్నో ఏళ్లుగా సుప్రీం కోర్టులో పెండింగ్ పడుతూ వస్తున్న అయోధ్య కేసు పరిష్కారం అయ్యింది. వివాదాస్పదంగా ఉన్న 2.77 ఎకరాల భూమిని అయోధ్య ట్రస్టు కు ఇస్తూ ఉత్తర్వులు జరీ చేసింది. ముస్లింలకు మరోచోట 5 ఎకరాల భూమిని ఇవ్వడానికి అంగీకారం తెలిపింది. అయితే, ఈ తీర్పు చెప్పేసమయంలో కొన్ని కీలక పాయింట్లు కూడా చెప్పింది సుప్రీం కోర్టు. 1992 డిసెంబర్ 5 వ తేదీన కరసేవకులు, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ కు చెందిన కొంతమంది వ్యక్తులు కలిసి అయోధ్యలోని బాబ్రీ మసీద్ ను నేలమట్టం చేశారు.
ఇలా మసీద్ ను కూల్చివేయడం చట్టపరంగా నేరం అని, మసీదును ధ్వసం చేసి ఇస్లామిక్ మూలాలను దెబ్బతీయడానికి ప్రయత్నించారు. ముస్లిం వర్గాలకు ఖచ్చితంగా న్యాయం జరగాల్సింది అని సుప్రీం కోర్టు తన తీర్పులో పేర్కొన్నది. బాబ్రీ మసీద్ ను కూల్చివేతతో సంబంధం ఉన్న వ్యక్తుల వివరాలు, దానికి సంబంధించిన కేసు సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉన్నది. అప్పట్లోనే సిబిఐ ఈ విషయంలో కేసు నమోదు చేసి 40 మందిపై కేసులు నమోదు చేసింది. కొంతమందిపై ఛార్జీషీట్ దాఖలు చేసింది.
సిబిఐ నమోదు చేసిన లిస్ట్ లో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ, అశోక్ సింఘాల్, మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతి, వినయ్ కటియార్, గిరిరాజ్ కిషోర్, నాటి యూపీ సీఎం కళ్యాణ్సింగ్ లు ఉన్నారు. అయితే, 2003 సెప్టెంబర్ 19న రాయ్ బరేలీలోని స్పెషల్ మెడిస్ట్రేట్ అద్వానీ, జోషీలకు విచారణ నుంచి విముక్తి కల్పించింది. ఆ తరువాత బాబ్రీ కూల్చివేత కేసు సుప్రీం కోర్టు ముందుకు వచ్చింది. 2017లో దీని గురించి సుప్రీమ్ కోర్టు కొంత తీర్పును ఇచ్చింది.
ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎల్కే అద్వానీ, ఉమాభారతి, మురళీ మనోహర్ జోషి, కళ్యాణ్ సింగ్ లను కూడా విచారించాలని సుప్రీం కోర్టు పేర్కొన్నది. నిన్నటి తీర్పు ను బట్టి చూస్తే.. బాబ్రీ మసీద్ కూల్చివేత కేసు వేగవంతం అయ్యేలా ఉన్నది. వీలైనంత త్వరగా సిబిఐ ఈ కేసుకు సంబంధించిన వివరాలతో కూడిన చార్జిషీటును త్వరలోనే సుప్రీం కోర్టులో దాఖలు చేయబోతున్నది. ఇదే జరిగి, అందులో అద్వానీ పేరు ఉంటె.. అద్వానీ విచారణ ఎదుర్కొనక తప్పదు.