తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ జేఏసీ బాధ్యతలు చేపట్టి..అందరిని ఒక్కతాటిపైకి తీసుకొచ్చి ఉద్యమంలో ముందుకు తీసుకెళ్లి.. తెలంగాణను సాధించే వరకు పోరాటం చేసిన వ్యక్తి ప్రొఫెసర్ కోదండరాం. అయన ఆధ్వర్యంలో తెలంగాణలోని అన్ని ఉద్యోగ సంఘాలు ఒక్కతాటిపైకి వచ్చాయి. సకలజనుల సమ్మెను విజయవంతం చేయడంలో అయన పాత్ర మరువలేనిది. సకలజనుల సమ్మె కారణంగానే కేంద్రం దిగివచ్చి తెలంగాణను ఇచ్చింది.
తెలంగాణ వచ్చిన ఆరేళ్లల్లో మరలా ఉద్యమం చేయాల్సి వస్తుందని ఎవరూ ఊహించలేదు. ఐదేళ్లు సాఫీగా గడిచిపోయాయి. ఐదేళ్ల తరువాత రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఒక్కొక్కటిగా మార్పులు జరుగుతూ వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో అక్కడి కార్మికులు పండుగ చేసుకున్నారు. దీంతో తెలంగాణలో కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని సమ్మె నోటీసు ఇవ్వడంతో అసలు కథ మొదలైంది.
సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ ఆర్టీసీ యాజమాన్యం దిగిరాలేదు. దీంతో అక్టోబర్ 5 వ తేదీ నుంచి సమ్మెకు దిగారు కార్మికులు. సమ్మెకు దిగడంతో ప్రభుత్వం భగ్గుమన్నది. ఆదాయం వచ్చే సమయంలో సమ్మె చేయడం తగదు అని చెప్పింది. కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయినట్టు పేర్కొన్నది. ఇది జరిగి చాలా రోజులైంది. ఇప్పటికి కార్మికులు ఇంకా సమ్మె చేస్తూనే ఉన్నారు.
ఇదిలా ఉంటె, ఈరోజు సుందరయ్య విజ్ఞాన భవన్ నుంచి ఆర్టీసీ కార్మికుల ర్యాలీ పెట్టుకున్నారు. ఈ ర్యాలీ కోసం కార్మికులు విజ్ఞాన భవన్ చేరుకున్నారు. ర్యాలీలో పాల్గొనడానికి వచ్సిన జనసమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాంను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రొఫెసర్ కోదండరాం ను పోలీసులు అరెస్ట్ చేయడంతో అక్కడ ఉద్రిక్తకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులకు, కార్మికులకు మధ్య వాదన జరుగుతున్నది. రేపు మిలీనియం మార్చ్ ను ట్యాంక్ బండ్ పై నిర్వహించబోతున్నారు. ఈ మిలీనియం మార్చ్ కు రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికులతో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ కదలివస్తున్నాయి.