మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుంది.... ఏపీ పరిస్థితి. ఈ సారి తాటికాయ కాదు ఏకంగా తుఫానే వస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా నిర్మాణ రంగం కుదేలైన సంగతి తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఒక పక్క వరదల కారణంగా ఏపీ లో ఇసుక తవ్వకాలు ఆగిపోయాయి. గత కొన్ని రోజులుగా ఎగువన వర్షాలు కురవడంతో ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన నదులకు వరదలు పోటెత్తింది. వానలు తగ్గిపోవడంతో మరోవారం రోజుల్లో వరద ఉదృతి తగ్గుతుంది.
అప్పుడు ఇసుక తవ్వకాలను జరపాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవారంలో అన్ని సర్దుకుంటాయిలే అనుకుంటున్న సమయంలో బుల్ బుల్ రూపంలో ఏపీకి మరో ముప్పు పొంచి ఉన్నది. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది.
అది తీవ్రరూపం దాల్చినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా దిశగా ‘బుల్ బుల్’ దూసుకు వస్తోంది. అండమాన్ నికోబార్ దీవులకు సమీపంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిన్నటికి తీవ్ర వాయుగుండంగా మారిన విషయం తెలిసిందే.
ఇది మరో 12 గంటల్లో తుపాన్గా రూపాంతరం చెందుతుందని విశాఖ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అండమాన్కు పశ్చిమ వాయువ్య దిశగా 200 కిలోమీటర్లు, పారాదీప్కు దక్షిణ ఆగ్నేయ దిశగా 920 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఇది తుపాన్గా మారే అవకాశం ఉండడంతో ‘బుల్ బుల్’గా నామకరణం చేశారు.
వాయువ్య దిశగా మెల్లగా కదులుతున్న తుపాన్ ఈనె 10వ తేదీ నాటికి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనావేసింది. తుపాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాు కురుస్తాయని, ముఖ్యంగా ఉత్తర కోస్తాలో భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ఇప్పటికే ఇసుక కొరత వలన ఇబ్బందులు పడుతుంటే.. ఈ బుల్ బుల్ తో మరిన్ని ఇబ్బందులు తలెత్తేలా కనిపిస్తున్నాయి.