ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటికీ 33వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు సమ్మెపై విరమణ విషయంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదు. కార్మికుల చేత సమ్మెను విరమింప చేసేందుకు ప్రభుత్వం వారితో సంప్రదింపులు జరపడంగాని, వారితో చర్చలు జరపడంగాని చేయడం లేదు. దీంతో కార్మికులు కూడా సమ్మె విషయంలో చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. పట్టిన పట్టు వదలడం లేదు.
ఇదిలా ఉంటె, మంగళవారం అర్ధరాత్రితో ప్రభుత్వం విధించిన డెడ్ లైన్ ముగిసింది. డెడ్ లైన్ తరువాత ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. డెడ్ లైన్ తరువాత సమ్మె చేస్తున్న కార్మికులను విధుల నుంచి పూర్తిగా తొలగించాలని భావిస్తున్నట్టు సమాచారం. అంతేకాదు, ప్రైవేట్ రూట్లకు అనుమతులు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.
ఇది జరిగితే.. క్రమంగా ఆర్టీసీ ప్రైవేట్ భాగస్వామ్యం అవుతుంది. ప్రైవేట్ వ్యక్తుల నియంత్రణ ఎక్కువగా ఉంటుంది. అది ఆర్టీసీకి మంచిది కాదని కార్మికులు అంటున్నారు. ప్రభుత్వం ఎన్ని డెడ్ లైన్లు పెట్టుకున్నా తాము విధుల్లోకి చేరే ప్రసక్తి లేదని, విధుల్లో చేరాలి అంటే ముందు తమ డిమాండ్లపై చర్చలు జరపాలని అంటున్నారు. ఇక డిపోల ముందు ధర్నాలు చేసేందుకు వచ్చిన కార్మికులను పోలీసులు అడ్డుకుంటున్నారు.
దీంతో అక్కడ ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇప్పటి వరకు డిపోల ముందు కార్మికులు శాంతియుతంగా ధర్నాలు, నిరసనలు తెలియజేస్తూ వస్తున్నారు. పోలీసులు కార్మికులను అడ్డుకోవడంతో... ఆర్టీసీ జేఏసీ దీనిని ఖండిస్తోంది. కేంద్రం సాయం కోరేందుకు సిద్ధం అవుతున్నది. ఆర్టీసీలో కేంద్రానికి 30శాతం వాటా ఉన్నది. ఆర్టీసీ విభజన వ్యవహారం కేంద్రం చేతుల్లో ఉన్నట్టుగా గతంలో ప్రభుత్వం పేర్కొన్నది కాబట్టి, ఈ వ్యవహారాన్ని కేంద్రం ముందుకు తీసుకెళ్లాలని ఆర్టీసీ జెఏసి భావిస్తోంది.