ఔను. కాస్త లోతుగా...పరోక్షంగా ఆలోచిస్తే...కలిగే భావన ఇదే. దాదాపు 30 రోజులుగా తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెను ఓ కొలిక్కి తేవాలని అన్నివర్గాలు భావిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు కార్మికుల ఆందోళనకు మద్దతు తెలిపాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఓ అడుగు ముందుకువేసి తాను స్వయంగా సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. అయితే, ఆయనకు నిరాశే ఎదురైంది. సీఎం కేసీఆర్, ఎంపీ కేశవరావు, కొందరు మంత్రులను తాను కలిసేందుకు సమయం కోసం జనసేన ప్రతినిధులు ప్రయత్నించారని అయితే...దీనిపై మాట్లాడేందుకు వాళ్లెవరూ సిద్ధంగా లేరని పవన్ పేర్కొన్నారు. దీంతో...``నవంబర్ 3న విశాఖలో జనసేన తలపెట్టిన లాంగ్మార్చ్ కార్యక్రమం తర్వాత మరోసారి ప్రయత్నిస్తా`` అని పవన్ తన కార్యక్రమం ఏంటో..దాని వివరాలేంటో...ప్రకటించారు.
ఆర్టీసీ సమ్మె సందర్భంగా ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఓ కొలిక్కి వచ్చేలా లేవనీ, ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు కలిసిన సందర్భంలో తనతో చెప్పారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. గత 28 రోజులుగా సమ్మెలో ఉన్నా ప్రభుత్వం వైపు నుంచి సరైన స్పందన లేదని బాధ పడ్డారని...సమస్య పరిష్కారం కోసం జోక్యం చేసుకోవాలని తనను కోరారని ఓ ప్రకటనలో పవన్ పేర్కొన్నారు. కార్మికుల సమస్యలపై మాట్లాడేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎంపీ కేశవరావుతో పాటు ముఖ్య నేతలెవరూ సుముఖంగా ఉన్నట్టు కనిపించడంలేదని తెలిపారు. తాను కలిసేందుకు సమయం కోసం జనసేన ప్రతినిధులు ప్రయత్నించారని వెల్లడించారు. దీనిపై మాట్లాడేందుకు వాళ్లెవరూ సిద్ధంగా లేరని పేర్కొన్నారు. నవంబర్ 3న విశాఖలో జనసేన తలపెట్టిన లాంగ్మార్చ్ కార్యక్రమం తర్వాత మరోసారి ప్రయత్నిస్తానని చెప్పారు.
స్థూలంగా...ఆర్టీసీ కార్మికులకు అండగా ఉండేందుకు పవన్ హామీ ఇస్తే...దాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ లైట్ తీసుకున్నారు. టీఎస్ఆర్టీసీ సమ్మెను ఓ కొలిక్కి తెచ్చే ప్రయత్నం పవన్ చేస్తే..కేసీఆర్ ప్రభుత్వ నుంచి మాత్రం...``మీ పని మీరు చూసుకోండి....మా పని మేం చూసుకుంటాం`` అన్న రీతిలో స్పందన వచ్చిందని పేర్కొంటున్నారు. అందుకే...జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన విశాఖ టూర్ గురించి చర్చించి...రూట్ మ్యాప్ వంటి వివరాలు సిద్ధం చేశారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.