కిందపడినా పైచేయి అంటూ హడావుడి చేస్తున్న టీడీపీకి ఏపీలో చుక్కలు చూపించే ప్రొగ్రాం స్టార్ట్ అవుతోంది. ఇప్పటికి ఆరు నెలలుగా అధికార వియోగం అనుభవిస్తున్న టీడీపీ అధినేత మళ్ళీ మాదే సీఎం కుర్చీ అంటూ కలలు కంటున్నారని రాజకీయ ప్రత్యర్దులు ఎద్దేవా చేస్తున్నారు. ఓ వైపు వలసలతో పసుపు శిబిరం సలసల మండుతున్నా ఇంకా బాగానే ఉన్నామని పెద్దాయన నవ్వలేక నవ్వుతున్నారు. అందువల్ల ఇకపై గట్టిగా, జబర్దస్త్ గా అసలైన మజాకా చూపించేందుకు రంగం రెడీ అవుతోంది.
బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఈ నెల 10వ తేదీన రాష్ట్రానికి వస్తున్నారు. ఆయన రాక వార్తతోనే టీడీపీ గుండెలు పీచుపీచుమంటున్నాయి. ఈసారి భారీ ఎత్తున వలసలు ఉంటాయని అంటున్నారు. అందులో భాగంగా పెద్ద ఎత్తుల జంపింగ్ జఫాంగులను బీజేపీ గుర్తించిందని అంటున్నారు. వారికి కమలం కండువా వేయడం ద్వారా బీజేపీకి కొత్త బలం ఇప్పించాలని, టీడీపీకి బిగ్ షాక్ ఇవ్వాలని కమలనాధులు అంటున్నారు. ముఖ్యంగా రాయలసీమ నుంచి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, భూమా బ్రహ్మానందరెడ్డి, బుడ్డా రాజశేఖరరెడ్డిలతో పాటు టీడీపీలో ఉన్న బిగ్ షాట్స్ ని బీజేపీలో చేర్చుకుంటారని టాక్ నడుస్తోంది.
అదే విధంగా కోస్తా జిల్లాలకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు కూడా భారీగా కమలం వైపుగా క్యూఅ కడతారని అంతున్నారు. ఇక మరో వైపు ఉత్తరాంధ్ర మీద కూడా బీజేపీ కన్ను పడింది. ఇక్కడ నుంచి కూడా టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు బీజేపీ తీర్ధం పుచ్చుకుంటారని అంటున్నారు. మొత్తానికి చూసుకుంటే టీడీపీకి సగానికి సగం ఖాళీ చేసేందుకే జేపీ నడ్డా ఏపీ టూర్ చేస్తున్నారని అంటున్నారు. నడ్డా రాకతో టీడీపీ నడ్డి విరుగుతుందని కూడా గట్టిగానే చెబుతున్నారు. దీంతో టీడీపీలో టెన్షన్ ఒక్కసారిగా కనిపిస్తోంది.