సరూర్ నగర్ లో సకలజనుల సమరభేరిసభ విజయవంతంగా జరుగుతున్నది. సరూర్ నగర్ లోని స్టేడియంలో ఈ సభ జరుగుతున్నది. వేలాది మంది ఈ సభకు హాజరయ్యారు. సభలోనే కాకుండా బయట వేలాది మంది సభలో జరుగుతున్న విషయాన్నీ మొబైల్ లో చూస్తూ వస్తున్నారు. ఈ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సభకు అనుమతి ఇచ్చారు. స్టేడియం ఓపెన్ గ్రౌండ్ లో సభను ఏర్పాటు చేసుకుందామంటే.. సభ బయటకు కాదు.. అని స్టేడియం లోపల మాత్రమే అనుమతి ఇచ్చారు.
ఈ సకలజనుల సమరభేరి సభకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. పార్టీల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా.. ఈ విషయంలో అన్ని కలిసి రావడం విశేషం. కాంగ్రెస్ పార్టీ నుంచి వీహెచ్, రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. రేవంత్ రెడ్డి మాట్లాడే సమయంలో సభలో ఒక్కసారిగా చప్పట్లో జయజయ ధ్వానాలు మోగాయి.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కుదరదని, అది తమ మ్యానిఫెస్టోలో లేదని కెసిఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై రేవంత్ రెడ్డి మాట్లాడారు. మ్యానిఫెస్టోలో ముఖ్యమంత్రి, మంత్రులు గా కెసిఆర్ కుటుంబాన్ని చేస్తారని మేనిఫెస్టోలో పెట్టారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆర్టీసీకి చెందిన అప్పులు, ఆస్తులు పంచుకోనప్పుడు.. ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీ తీసుకున్న నిర్ణయమే.. తెలంగాణలో కూడా అమలు జరుగుతుందని, జరగాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేసినపుడు తెలంగాణలో ఎందుకు సాధ్యం కావడంలేదని ప్రశ్నించారు. మరోవైపు ఈ సభలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కొండరామ్ కూడా మాట్లాడారు. గతంలో చేసినట్టుగానే మరోసారి మిలీనియం మార్చ్ జరుగుతుందని, పోరాటం చేసి ఆర్టీసీని విలీనం చేసుకుంటామని అయన అన్నారు. ఆర్టీసీ ఆస్తులను ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉండేవారికి దోచి పెడుతుందని విమర్శించారు.