వైసీపీలో విభేదాలు ఒక్కసారిగా బయటపడుతున్నాయి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అయినా గట్టిగా కాలేదు కానీ నాయకుల మధ్య విభేధాలు ముదిరి పాకాన పడుతున్నాయి. విశాఖ జిల్లా వరకు వస్తే సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్, మంత్రి అవంతి శ్రీనివాస్ ల మధ్య విభేదాలు ఉన్నాయన్నది అందరికీ తెలిసిందే. అయితే అవి ఒక్కసారిగా బయటపడడం విశేషం. ఒకే వేదిక మీద మంత్రి, ద్రోణం ఇద్దరూ వాదులాడుకోవడం విశాఖ వైసీపీకి డేంజర్ బెల్స్ మోగుతున్నాయని చెప్పకనే చెబుతోంది
తాను పక్కా లోకల్ అని అవంతి ఎక్కడ నుంచి వచ్చారో తనకు తెలియదు అని ద్రోణంరాజు శ్రీనివాస్ అనడం ద్వారా మాటలయుధ్ధానికి పదును పెట్టారు. వలస వచ్చిన అవంతి శ్రీనివాస్ విశాఖలో వ్యాపారం చేసుకున్నారని, రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయడం మంచిదే కానీ ఆయన పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలని ద్రోణం పదునైన బాణాలే విసిరారు. ఇక్కడే పుట్టి పెరిగిన తనకంటే విశాఖ జిల్లా ప్రజల సమస్యలపైన అవగాహాన ఉన్న వారు ఎవరైనా ఉన్నారా అని ఆయన ప్రశ్నించడం విశేషం.
అంతకు ముందు మంత్రి అవంతి శ్రీనివాస్ ద్రోణంరాజుకు గ్రామాల సమస్యలు తెలియవు అనడంతోనే అసలు వివాదం వచ్చింది. తాను పెరిగింది నగరంలో అయినా పుట్టింది విశాఖ జిల్లా జుత్తాడలో అంటూ ద్రోణంరాజు చెప్పడమే కాదు. తన కుటుంబమే ప్రజల కోసం పనిచేసేదని చెప్పుకున్నారు. తనకు పదవులతో పనిలేదని కూడా ఆయన అన్నారు. తనకు పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన జగనే విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ చైర్మన్ పదవి ఇచ్చారని ద్రోణంరాజు చెప్పడం విశెషం. తాను ఈ పదవి కూడా వదులుకుంటానని ఆయన అనడం మరో విశేషం. మొత్తానికి విశాఖ వైసీపీలో ముసలం పుట్టిందన్నది క్యాడర్ని కలవరపెడుతోంది.