టిడిపి మ్యానిఫెస్టో టిష్యు పేపరా ?
తెలుగుదేశంపార్టీ
ఎన్నికల్లో ప్రకటించిన మ్యానిఫెస్టో టిష్యు పేపర్ లాగ అయిపోయిందా ? అసెంబ్లీ
సమావేశాల్లో మాట్లాడుతూ వైసిపి సభ్యుడు అంబటి రాంబాబు టిడిపి మ్యానిఫెస్టోను
టిష్యు పేపర్ తో పోల్చారు. ఆ సమయంలో సభలో ఉన్న టిడిపి సభ్యులున్నప్పటికీ పెద్దగా
వ్యతిరేకించకపోవటం గమనార్హం.
ఇంతకీ విషయం ఏమిటంటే అసెంబ్లీలో వైసిపి, టిడిపి మ్యానిఫెస్టోలు, వాటి అమలు విషయమై చర్చ జరిగింది. ఆ సందర్భంగా అంబటి మాట్లాడుతూ మ్యానిఫెస్టో అమలు విషయంలో చిత్తశుద్ది లేకపోవటం వల్లే తన హామీలనే చంద్రబాబు తుంగలో తొక్కినట్లు చెప్పారు.
మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను చంద్రబాబు చిత్తశుద్దితో అమలు చేయలేదు కాబట్టే జనాలు మొన్నటి ఎన్నికల్లో ఓడగొట్టినట్లు చెప్పారు. కాపులను బిసిల్లో చేర్చటం, రైతు రుణమాఫీ చేయటం లాంటి అనేక అంశాలను ఉదహరించి చంద్రబాబు గాలి తీసేశారు. తమను బిసిల్లో చేర్చి రిజర్వేషన్లు కల్పించాలని కాపు నేతలు అడిగినా జగన్మోహన్ రెడ్డి సాధ్యం కాదని స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు.
తమ మ్యానిఫెస్టోలో చెప్పిన అంశాలను జగన్ ఇప్పటికే 80 శాతం పూర్తి చేసిన విషయాన్ని కూడా అంబటి గుర్తు చేశారు. టిడిపి మ్యానిఫెస్టో అమలుపై చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే వెబ్ సైట్ నుండి ఎందుకు తొలగించారంటూ నిలదీశారు. మ్యానిఫెస్టో అంటే చంద్రబాబుకు టిష్యు పేపర్ అనే భావన ఉండటం వల్లే అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోలేదంటూ అంబటి మండిపోయారు.