తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపిన సంగతి తెలిసిందే.. బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ద్వారా ఆ పార్టీకి చెందిన జాతీయ నాయకులతో వాణి మంతనాలు జరిపినట్లు సమాచారం. వాణి బీజేపీ తీర్థం పుచ్చుకుంటే మాత్రం వైసీపీకి షాక్ తగిలినట్లేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా.. వాణి ఏపీలో ఓ బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత అనే విషయం తెలిసిందే. సోమవారం సాయంత్రం నుంచి వాణి వైసీపీకి గుడ్ బై చెబుతారని పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎంపీలు, ముఖ్యనేతలు టీడీపీకి టాటా చెప్పేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్న విషయం విధితమే. అయితే ఇక వైసీపీ వంతు వచ్చింది.
ఈ విషయంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దాపురం నాయకురాలు తోట వాణి స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని కొట్టిపారేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా కల్పిత వార్తలు ప్రచురించడం మీడియా సంస్థలకు తగదని హితవు పలికారు.
ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి ఆమె ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. మాజీ డిప్యూటీ సీఎం, టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప చేతిలో ఆమె ఓటమిపాలయ్యారు. తప్పుడు అఫివిడవిట్తో చినరాజప్ప ఎన్నికల సంఘాన్ని మోసం చేశారని తోటవాణి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.