తెలంగాణ సీఎం కేసీఆర్ తన పవర్ చూపిస్తున్నారా? ఆయన తన అధికారాన్ని వినియోగిస్తున్నారా? ఇప్పటి వరకు ఆచి తూచి అడుగులు వేసిన ఆయన ఇప్పుడు తన అసలు సిసలు అజెండాను తెరమీదికి తెస్తున్నారా? అంటే.. ఔననే అంటు న్నారు పరిశీలకులు. గత ఏడాది డిసెంబరులో తెలంగాణ ఎన్నికలు జరిగాయి. ఈ క్రమంలో అక్కడ జరిగిన రాజకీయాలు కేసీఆర్ను ఉడికెత్తించాయి. ముఖ్యంగా ఓ వర్గం మీడియా కేసీఆర్పై కత్తికట్టినట్టు వ్యవహరించింది.
ముఖ్యంగా అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్కు వ్యతిరేకంగా కాంగ్రెస్తో జట్టుకట్టి.. ముందుకు సాగారు. దీనికి ఓ మీడియా సంస్థ కూడా దన్నుగా నిలిచింది. కేసీఆర్కు వ్యతిరేకంగా బాబుకు అనుకూలంగా కథనాలు వండి వార్చింది. అదే మీడియాకు ఉన్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో కేసీఆర్ వ్యతిరేక, బాబు అనుకూల వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. దీనిని మనసులో పెట్టుకున్న కేసీఆర్ సమయం కోసం వేచి చూశారు. ప్రభుత్వం ఏర్పడిన తొలి ఆరు మాసాలు ఆయన మౌనంగానే ఉన్నారు.
అయితే, తాజాగా మాత్రం కేసీఆర్ దూకుడు పెంచి.. నిబంధనల పేరుతో సదరు మీడియాను ఆర్థికంగా ఇరుకున పెట్టేలా వ్యవహరించారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించి.. ఎన్నికల సమయంలో తనను ఇబ్బందిపెట్టిన మీడియాపై కసి తీర్చుకున్నారు. సదరు దమ్మున్న మీడియాకు అటు తెలంగాణలోను, ఇటు ఏపీలో సంస్థలు ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ టీవీ, పేపర్ కూడా ఉంది.
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా కేసీఆర్ అన్ని మీడియా సంస్థలకూ కోట్లకు కోట్లు కుమ్మరిం చారు. ప్రారంభానికి సంబంధించి ప్రచారం చేసుకున్నారు. ప్రింట్ మీడియాకైతే.. ఒక్కొక్క మీడియా సంస్థకు ఉన్న పేప ర్లో తొలి రెండు పేజీల్లోనూ భారీ ఎత్తున ప్రకటన ఇచ్చారు. అటు తెలంగాణలోనూ ఇటు ఏపీలో కూడా ప్రకటనలు ఇచ్చారు. అయితే, తనను దుమ్మెత్తి పోసిన దమ్మున్న పత్రికపై మాత్రం కసి తీర్చుకున్నారు. ఈ పత్రికకు నిబంధనల మేరకు కేవలం తెలంగాణలో మాత్రమే అదికూడా సింగిల్ పేజీ వరకే ప్రకటన జారీ చేశారు. మీడియా ఛానెల్ను అస్సలు పట్టించుకోలేదు.
ఇక, ఏపీలో కూడా నడుస్తున్న దమ్మున్న పత్రికకు ప్రకటనల ఊసే లేకుండా చేశారు. ఫలితంగా కేసీఆర్ నిర్ణయంతో ఈ పత్రిక దాదాపు 10 కోట్ల రూపాయలు కోల్పోయిందని సమాచారం. మిగిలిన పత్రికలు, మీడియాకు మాత్రం కేసీఆర్ ఇబ్బడి ముబ్బడిగా కొట్లు కుమ్మరించారు. మొత్తానికి ఈ పరిణామం రాబోయే రోజుల్లో మరింత తీవ్రం కావడం ఖాయమని అంటున్నారు. మరి ఏం జరగుఉతుందో చూడాలి.