బీజేపీ. కేంద్రంలో బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని, అటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ, ఇటు ఉత్తరాదిన కూడా తన సత్తా చాటుతున్న ఈ పార్టీ దక్షిణాదిలోని కర్ణాటక వరకే పరిమితమైంది. అయితే, ఇప్పుడు దక్షిణాదిలోని మరికొన్ని రాష్ట్రాల్లోనూ సత్తాచాటాలని కమలనాధులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యంగా ఏపీలో తమను తిట్టిపోసి.. ప్రధాని నరేంద్రమోడీని ఓడించాలని దేశవ్యాప్తంగా పర్యటించి, ప్రాంతీయ పార్టీలకు ప్రచారం చేసిన చంద్రబాబును నామ రూపాలు లేకుండా చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకుగాను అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకునేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
ఏపీలో అధికార పార్టీ వైసీపీ కంటే బీజేపీ విపక్ష టీడీపీనే ప్రధానంగా టార్గెట్ చేస్తోంది. ఎన్డీయే నుంచి బయటకు వచ్చాక బీజేపీ ప్రధాన శత్రువు టీడీపీ అయిపోయింది. దీంతో ఇక్కడ అధికారంలో ఉన్న వైసీపీ జోలికి పోకుండా.. ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ అంతు చూడాలని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ ఎంపీలు, ఎమ్మె ల్యేలను కూడా తమ పార్టీ వైపు తిప్పుకొనేలా బీజేపీ నాయకులు చక్రం తిప్పుతున్నారు. ముఖ్యంగా పారిశ్రామిక వర్గంగా ఉన్న సీఎం రమేష్, సుజనా చౌదరి, బీద మస్తాన్ రావ్ సోదరులు వంటివారిని కేసులతో ఇరుకున పెట్టడం ద్వారా వారు టీడీపీ నుంచి బయటకు వచ్చేలా చేస్తోందనే అభిప్రాయం బీజేపీపై వ్యక్తమవుతోంది. అదే సమయంలో విజయవాడ ఎంపీగా గెలిచిన కేశినేని నానికి కూడా బీజేపీ పావులు కదుపుతోంది.
ఇక, ఎమ్మెల్యేల విషయానికి వచ్చినా.. టీడీపీ నుంచి గెలిచిన వారిలో కేవలం 10 నుంచి 13 మంది మాత్రమే టీడీపీని సొంత పార్టీగా భావించేవారు ఉన్నారు. లేదా కొన్ని దశాబ్దాలుగా ఆ పార్టీతో అనుబంధాన్ని పెనవేసుకున్న వారు ఉన్నారు. మిగిలిన వారంతా కూడా తాజా ఎన్నికల్లో విజయం సాధించిన వారే.. తప్ప . టీడీపీతో పెద్దగా అనుబంధం ఉన్నవారు కాదు. ఈ నేపథ్యంలో వీరిని నయానో భయానో.. బీజేపీవైపు తిప్పుకొనేందుకు పావులు కదుపుతున్నారు. ఇదే విషయాన్ని నర్మగర్భంగా చెబుతున్న బీజేపీ నాయకులు.. ఏపీలో బీజేపీ ఖచ్చితంగా బలపడుతుందని, ఐదేళ్లుగా చంద్రబాబు బీజేపీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని, చంద్రబాబు అధికారులతో కూడా తిట్టించారని గత విషయాలను తెరమీదికి తెస్తున్నారు. బీజేపీని నాశనం చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారని వ్యాఖ్యానించారు. దీనిని బట్టి.. చంద్రబాబును, ఆయన పార్టీని నాశనం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని తెలుస్తోంది.