తెలంగాణ ఉద్యమ యోధుడు,సీఎం కేసీఆర్.. దూకుడు పెంచారు. ఎన్నికలకు ముందు కంటే ఎక్కువగా ఆయన దూకు డు ప్రదర్శిస్తున్నారు. ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయడం ద్వారా కేంద్రంలో చక్రం తిప్పాలని నిర్ణయించుకు న్న కేసీఆర్ దాదాపు ఏడాది కాలంగా ఆయన దీనిపైనే పనిచేస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలతో ఆయన ఒక దఫా చర్చలు జరిపారు. రాష్ట్రాల సార్వభౌమాధికారం, హక్కులు, కేంద్రం నియంతృత్వ ధోరణిని తెగనాడడం వంటి వాటిని సమర్ధంగా చేపట్టాలంటే.. అన్ని రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలూ బలంగా ఉండాలని, ఒక్కతాటిపైకి రావాలని చెప్పుకొస్తున్నారు.
ఈ దిశలోనే సీఎం కేసీఆర్.. ఫెడరల్ ఫ్రెంట్కు రూపకల్పన దిశగా అడుగులు వేస్తున్నారు. భేషజాలను పక్కన పెట్టి.. ఆయన ఆయా రాష్ట్రాల్లో తిరుగుతూ.. సీఎంలను కలుస్తూ.. చర్చలు సాగిస్తున్నారు. డిసెంబరులో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించిన కేసీఆర్.. ఆ వెంటనే తన లక్ష్యాన్ని వెల్లడించారు. దేశ సువిశాల భవితవ్యం కోసం కేంద్రం లో ఫెడరల్ ఫ్రెంట్ రావాల్సిన అవసరం ఉందని , ఆ దిశగా తాను ఎంతో కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఇప్పటికే ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీని ఆయన తన ఖాతాలోనే వేసుకున్నారు. దీనికి వైసీపీ అధినేత జగన్కూడా పచ్చజెండా ఊపారు.
ఇక, ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో కూడా కేసీఆర్ మరోసారి తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తాజాగా ఆయన తమిళనాడు విపక్షం డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ తో భేటీ అయ్యారు. ఫెడరల్ ఫ్రెంట్ విషయాలను ఆయనతో పంచుకున్నారు. ఈ నెల 23 నాటి ఫలితాల కు ముందుగానే ఫెడరల్ ఫ్రెంట్కు రూపకల్పన చేయాలని కేసీఆర్ ఉవ్వి ళ్లూరుతున్నారు. అదేవిధంగా కర్ణాటక సీఎం కుమార స్వామికి కూడా కేసీఆర్ ఫోన్ చేశారు. ఆయనతోనూ ఇదే విషయాన్ని చర్చించారు. ఇక, పక్కనే ఉన్న కేరళతోనూ కేసీఆర్ కలివిడిగా ఉంటున్నారు. అక్కడి సీఎం పినరయి విజయన్తో సంప్రదింపులు జరిపారు. ఆయనతోనూ భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి కేసీఆర్ దూకుడు చూస్తే.. పక్కా ప్లానింగ్తో ఎన్నికల ఫలితాలు వచ్చే నాటికి అస్త్రశస్త్రాలతో కేంద్రాన్ని శాంసిచే పరిస్థితి రావడం తథ్యమని అంటున్నారు పరిశీలకులు.