ఆమె ఓ సామాన్య రాజకీయ నాయకురాలు., ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న చోటా నాయకురాలు. ప్రస్తుతం విజయనగరం జిల్లా జెడ్పీ చైర్ పర్సన్గా ఉన్నారు. అయితేనేం.. ఆమె ఆశలు మాత్రం పార్లమెంటుకు చేరాయి. ఎవరైనా చిన్న చిన్నగా ఎదగాలని కోరుకుంటారు. కానీ, ఆ టీడీపీ మహిళా నాయకురాలు మాత్రం ఏకంగా ఇక్కడ వేసిన అడుగును ఢిల్లీలో పడేలా ప్లాన్ చేస్తోంది. దీంతో ఆమె పట్ల ఆసక్తిక రాజకీయం నడుస్తోంది. విషయంలోకి వెళ్తే.. అరకు లోక్ సభ స్థానం నుంచి ప్రస్తుతం కొత్తపల్లి గీత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, ఆమె ఏ పార్టీలోనూ లేరు. అప్పట్లో వైసీపీ నుంచి గెలిచినా.. తర్వాత మాత్రం ఆ పార్టీకి రాం రాం పలికారు. కుదిరితే టీడీపీలోకి రావాలని ప్రయత్నించారు కానీ, వీలు పడక ఆగిపోయింది.
అయితే, వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి ఎంపీగా పోటీ చేయాలని ప్రస్తుతం విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్పర్సన్గా బాధ్యతలను నిర్వరిస్తున్న శోభా స్వాతిరాణి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఆమె భర్త గులిపల్లి గణేశ్ కూడా తెరవెనుక చక్రం తిప్పుతున్నారు. కులపరంగా.. విద్యాపరంగా తమకు సరితూగే అభ్యర్థి లేరని తెగేసి చెబుతున్నారు. అరుకు లోక్సభ పరిధిలో ఉన్న నియోజకవర్గాలలో అభివృద్ధి పథకాలను మంజూరు చేయించుకుంటున్నారు. ఇటీవల మంత్రి లోకేశ్ గిరిజన ప్రాంతాలను సందర్శించినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏలుబడిలో ఉన్న కురుపాం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతి ఊరులో ఇంటింటికీ కుళాయి నీరు ఇప్పించేందుకు వంద కోట్లు మంజూరు చేయించారు. అలాగే పార్వతీపురం.. సాలూరు నియోజకవర్గాలలోని గిరిజన ప్రాంతాల్లో లోకేష్ పర్యటనను ఖరారు చేయించి అనేక పథకాలకు శంకుస్థాపనలు చేయించారు.
వైద్యురాలైన స్వాతిరాణికి అనూహ్యంగా ఛైర్పర్సన్ పీఠం దక్కింది. అయితే ఇప్పుడు ఈ రిజర్వేషన్ రొటేషన్ పద్దతిలో ఉండటంతో కాసింత ముందుగానే తమ రాజకీయ భవిష్యత్తు కోసం ప్రణాళికలు రచించుకుంటున్నారు. ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలియని అరుకు ఎంపీ కొత్తపల్లి గీత రాజకీయ బలహీనతలను తెలుగుదేశంపార్టీ బాగా వినియోగించుకుంటోంది. వైసీపీ తరఫున కొత్తపల్లి గీత పోటీ చేసి గెలుపొందినప్పటికీ నియోజకవర్గంలో చుట్టపుచూ పుగా వచ్చిపోతారే తప్ప ఇక్కడ అభివృద్ధి గురించి పట్టించుకోలేదు. దీంతో తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం.. విశాఖలోని పాడేరు.. అరుకు.. విజయనగరం జిల్లాలోని సాలూరు.. పార్వతీపురం.. కురుపాం.. శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ నియోజకవర్గాలలో స్వాతిరాణి.. గణేశ్ తమ కులాల సమీకరణలు చేస్తున్నారు.
గిరిజన తెగకు చెందిన స్వాతిరాణిది బగత కులం.. ఈమె భర్త గణేశ్ కొప్పల వెలమకు చెందినవారు. అయితే రంపచోడవరం.. అరుకు.. పాడేరు నియోజకవర్గాలలో స్వాతిరాణికి చెందిన బగత కులస్తులు అధికం.. అలాగే విజయనగరం జిల్లాలోని సాలూరు.. పార్వతీపురం.. కురుపాం నియోజకవర్గాలలో గణేశ్ సామాజికవర్గం ఎక్కువగా ఉంది. సర్పంచులు.. ఎంపీటీసీలు.. జడ్పీటీసీలకు చెందిన పనులన్నీ జిల్లా పరిషత్ నుంచి చకచకా చేయిస్తున్నారు. ఇందుకోసం శ్రీకాకుళం.. విజయనగరం.. విశాఖపట్టణాలకు చెందిన జిల్లా పరిషత్ నిధులను సమకూరుస్తున్నారు. అయితే సాలూరు నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి కూడా అరుకు లోక్సభ స్థానంపై దృష్టి పెట్టారు. అయితే ఆమె ఎమ్మెల్సీ పదవీకాలం మరో రెండేళ్ల పాటు ఉంది. అందుకే సంధ్యారాణి అసలు తమకు పోటీనే కాదని స్వాతిరాణి వర్గం చెబుతోంది. మొత్తానికి మరి ఈ జెడ్పీచైర్పర్సన్ ఎంపీ కలలు ఏ మేరకు నెరవేరుతాయో చూడాలి.