ప్రస్తుతం కన్నడ రాజకీయం ఎంతో రసవత్తరంగా మారింది. ఓ వైపు ఎక్కువ స్థానాలు గెల్చుకున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు మొదలు పెట్టింది. మరోవైపు బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా పక్కా ఫ్యూహంతో కాంగ్రెస్ అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో జేడీఎస్ తో జతకట్టింది. ప్రస్తుతం కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే గవర్నర్ ని కలిసి ఈ విషయంపై ప్రస్తావించినట్లు సమాచారం.
కర్నాటక సీఎం సీటుపై ఎవరు కూర్చుంటారనే టెన్షన్ ఓవైపు కొనసాగుతుండగా.. మరోవైపు జేడీఎస్ ఎల్పీ నేతగా హెచ్డీ కుమారస్వామి ఎన్నికయ్యారు. బెంగుళూరులో జరిగిన జేడీఎస్ మీటింగ్లో కుమారస్వామిని పార్టీ చీఫ్గా ఎన్నుకున్నట్లు ఆ పార్టీ నేత మంజునాథ్ తెలిపారు. కాగా, కాంగ్రెస్, జేడీఎస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, కుమారస్వామే సీఎం అవుతారని ఆయన చెప్పారు.
తమపై ఎవరి ప్రభావం ఉండదన్నారు. అటు బీజేపీ కూడా తమ పార్టీ చీఫ్గా యడ్యూరప్పను ఎన్నుకున్నది. తమ పార్టీ తనను చీఫ్గా ఎన్నుకున్నట్లు యడ్యూరప్ప తెలిపారు. గవర్నర్ వాజూభాయ్ వాలాకు ఆ లేఖను సమర్పించినట్లు వెల్లడించారు. గవర్నర్ తనకు ఆహ్వానం అందిస్తారని ఆశిస్తున్నట్లు యడ్యూరప్ప తెలిపారు.