సర్పంచ్ గా గెలిచింది.. కానీ సచివాలయంలోకి నో ఎంట్రీ?
ఈ ఘటన కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా గుమ్మగట్ట గ్రామ పంచాయతీలో వెలుగులోకి వచ్చింది అనేది తెలుస్తుంది. సర్పంచ్ గెలిచినవారు సచివాలయం పై పూర్తి అధికారాలను కలిగి ఉంటారు. అంతేకాదు గ్రామాభివృద్ధికి సంబంధించిన వివరాలన్నీ ఆయన తెలుసుకునేందుకు అధికారం ఉంటుంది. కానీ ఇక్కడ ఒక మహిళా సర్పంచ్ విజయలక్ష్మిని మాత్రం సిబ్బంది అధికారులు చిన్నచూపు చూశారు. దీంతో ఇది భరించలేకపోయిన సదరు మహిళా సర్పంచ్ సచివాలయం ముందు నిరసన వ్యక్తం చేసింది.
ఇటీవలే శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా గ్రామ సచివాలయం ఆరుబయటే కుర్చీ వేసుకుని కూర్చున్నా సదరు మహిళా సర్పంచ్ న్యాయం చేయాలంటూ డిమాండ్ చేయడం గమనార్హం. సర్పంచ్ గా ఎన్నికైనప్పటికీ నేటి వరకు సచివాలయంలో కూర్చొనివ్వలేదని సదరు మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా సంక్షేమ పథకాలు ఇతర సేవల గురించి తెలుసుకునేందుకు ప్రయత్నించినా అధికారులు సంబంధిత సమాచారాన్ని తనకు చెప్పడం లేదు అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇక తనపై మండల అధికారులు సైతం ఇలాంటి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చింది . ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళతాను అంటూ తెలిపింది.