సంక్రాంతి వేడుకల కోసం ఆంధ్రాకు వస్తున్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు తిరిగి మళ్లీ ఢిల్లీకి వెళ్లిపోయారు. అయితే, నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసిన ఆయన గెలిచిన నాటి నుంచి ఒక్కసారి కూడా నియోజకవర్గంలో అడుగుపెట్టలేదు. సీఎం జగన్ మోహన్ రెడ్డితో విభేధాల కారణంగా గెలిచిన కొన్ని రోజులకే పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఎంపీకి ఎమ్మెల్యేలతో పాటు నేతలకు మధ్య పడకపోవడంతో నియోజకవర్గంలో అసలు కనిపించలేదు. అప్పటి నుంచి దాదాపు ఢిల్లీలోనే మకాం వేశారు.
కొన్ని రోజుల క్రితం పనినిమత్తం హైదరాబాద్ వచ్చిన ఎంపీ రఘురామను సీఐడీ అధికారులు అరెస్టు చేయడం.. ఈ సందర్భంగా జరిగిన వివారాలు, కేసులు తెలిసిన విషయాలే. ఇప్పుడు తాజాగా సంక్రాంతి వేళ భీమవరం కు 13 వ తేదిన వస్తున్నట్టు ఎంపీ రఘురామ ప్రకటించారు. దీంతో భీమవరం రావడానికి హైదరాబాద్ చేరుకున్న రఘురామకృష్ణం రాజుకు విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు జారీ అందజేశారు. అయితే, ఉన్న ఫలంగా తాను హాజరు కాలేనని సమయం ఇవ్వాలని కోరగా 17వ తేది రోజు విచారణకు హాజరు కావాలని చెప్పారు.
దీంతో.. వైసీపీ ప్రభుత్వం తనపై కక్ష్య కట్టిందని.. తన కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరూ కూడా ఎయిర్పోర్టుకు రావద్దని ఆయన పేర్కొన్నారు. నోటీసుల ప్రకారం విచారణకు హాజరవుతే ఏం జరుగుతుందోని..? ఆలోచించుకుని భీమవరం పర్యటనను రద్దు చేసుకుని తిరిగి ఢిల్లీ పయనమయ్యారు.
విచారణకు సంబంధించి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యల కోసం తన లాయర్లతో చర్చించాలని ఎంపీ రఘురామ అనుకుంటున్నారట. కోర్టులో కేసు వేసి విచారణ సందర్భంలో తన లాయర్లు పక్కనే ఉండే విధంగా సుప్రీం కోర్టును కోరేందుకు ఎంపీ రఘురామ కృష్ణం రాజు భావిస్తున్నారట. అయితే, తాను ఫిబ్రవరి 5 తరువాత ఎంపీ పదవికి రాజనామా చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించిని విషయం తెలిసిందే.