పాపం జగన్.. పథకాలకు నిధుల కొరత... !
ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఓ కీలక కార్యక్రమాన్ని వాయిదా వేసింది. ప్రతి ఏటా సంక్రాంతి సమయంలో రెండు పథకాలను వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇప్పుడు ఆ రెండు పథకాల అమలు వాయిదా పడింది. ఇందులో మొదటిది అమ్మఒడి పథకం. ప్రతి ఏటా జనవరి 10వ తేదీన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 15 వేల రూపాయల నగదును ప్రభుత్వం జమ చేస్తోంది. ఇది ఇప్పుడు జూన్ నెలకు వాయిదా పడింది. అలాగే ఈబీసీ నేస్తం పథకం కూడా ఇప్పుడు వాయిదా పడింది. ఈ నెల పదవ తేదీన ఈబీసీ నేస్తం పథకం కోసం ముహుర్తం ఖరారు అయ్యింది. పథకం ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కర్నూలు జిల్లా నంద్యాలలో పర్యటించాల్సి ఉంది. ఇప్పటికే భారీ ఏర్పాట్లు కూడా చేశారు. 45 ఏళ్లు దాటిన ఓసీ మహిళలకు ప్రతి ఏటా 15 వేల రూపాయలు అందించాలని గతంలో నిర్ణయించారు. ఈ పథకానికి దాదాపు 650 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని అధికారులు అంచనా వేశారు. కానీ ప్రస్తుతం నిధుల సమీకరణ అసాధ్యంగా మారిపోయింది. దీంతో తప్పని పరిస్థితుల్లో ఈబీసీ నేస్తం పథకం ప్రస్తుతానికి వాయిదా పడింది.