సీఎం జగన్ తో కేంద్ర బృందం భేటీ, పనితీరుపై ప్రశంసలు
జగన్ నాయకత్వంతో రాష్ట్ర ప్రభుత్వం పనితీరును ప్రశంసించారు. అంకిత భావంతో పనిచేసే అధికారులు ఉన్నారని.. వీరంతా తమకు మంచి సహకారాన్ని అందించారని చెప్పారు. యువకులు, డైనమిక్గా పనిచేసే అధికారులు ఉండడం.. విపత్తు సమయంలో అద్భుతంగా పనిచేశారని పొగిడారు. వారి పర్యటనల్లో వివిధ రాజకీయ ప్రనిధులను, మీడియా ప్రతినిధులను కలుసుకున్నామని, ప్రతి ఒక్కరూ కూడా వరదల్లో రాష్ట్ర ప్రభుత్వం పనితీరును ప్రశంసించినట్టు చెప్పారు. సంప్రదాయంగా వరదలు వచ్చే ప్రాంతం కాదని, అలాంటి ప్రాంతంలో ఊహించని రీతిలో వర్షాలు పడినట్టు పేర్కొన్నారు. ఈ స్థాయిలో వరదను తీసుకెళ్లగలిగే పరిస్థితి అక్కడున్న నదులు, వాగులు, వంకలకు లేదని అన్నారు.
కరువు ప్రాంతంలో అతి భారీవర్షాలు కురిశాయని, ఈ స్థాయిలో వరదను నియంత్రించగలిగే రిజర్వాయర్లు, డ్యాంలు కూడా ఈ ప్రాంతంలో లేవని చెప్పారు. ఉన్న డ్యాంలు, రిజర్వాయర్లు కూడా ఈస్థాయి వరదలను ఊహించి నిర్మించినవి కావని తెలిపారు. ఇలాంటి పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా తలెత్తున్నాయని, కరువు ప్రాంతాల్లో కుంభవృష్టి, నిరంతరం మంచి వర్షాలు కురిసేచోట కరువు లాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి అని తెలిపారు. తీరందాటిన తర్వాత అల్పపీడనం వెంటనే తొలగిపోలేదు, అది చాలా రోజులు కొనసాగిందన్నారు.
కడప జిల్లాలో వరదల వల్ల నష్టం అధికంగా ఉందని, అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయిన చోట... నష్టం అపారంగా ఉందని పేర్కొన్నారు. చిత్తూరులో జిల్లాలో కొంత భాగం, నెల్లూరులో కూడా వరదల ప్రభావం అధికంగా ఉంన్నారు. బ్రిడ్జిలు, రోడ్లు తెగిపోవడం వల్ల చాలా గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయన్నారు. వరద సమయంలో అధికారులు చాలా బాగా పనిచేశారన్నారు. ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు ఇంత త్వరగా కరెంటు పునరుద్ధరణ అన్నది సహజంగా జరగదు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలను ప్రశంసించారు.
ఇలాంటి విపత్తు హృదయ విదారకరం: సీఎం
నష్టం అంచనాల కోసం ఆయా ప్రాంతాల్లో పర్యటించినందుకు కేంద్ర బృందానికి సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు. ఉదారంగా, మానవతా పరంగా స్పందించాలని కోరారు. మేం పంపించిన నష్టం వివరాల్లో ఎలాంటి పెంపూ లేదని చెప్పారు. నష్టం అంచనాల తయారీకి క్షేత్రస్థాయిలో మాకు సమర్థవంతమైన వ్యవస్థ ఉందని తెలిపారు. ప్రతి గ్రామంలో ఆర్బీకే ఉంది, ప్రతి రైతు పంటకూడా ఇ–క్రాప్ అయ్యింది అని సోషల్ ఆడిట్ కూడా చేయించామని చెప్పారు. కోవిడ్ నియంత్రణా చర్యల కోసం వినియోగించినందువల్ల ఎస్టీఆర్ఎఫ్ నిధులు నిండుకున్నాయని మా ఆర్థిక శాఖ కార్యదర్శి మీకు వివరించారని, పనులు చేయాలంటే నిధులు అవసరం, వెంటనే అడహాక్ ప్రాతిపదికన నిధులు ఇవ్వాలని కోరుతున్నామన్నారు సీఎం జగన్.