రైతు చట్టాల రద్దు... విపక్షమే కీలకం...!
పార్లమెంట్ సమావేశాల్లో రద్దు చేసిన తర్వాతే ఆందోళన విరమిస్తామని తేల్చి చెప్పారు రైతులు. అయితే రైతుల ఆందోళనలకు పూర్తిస్థాయి మద్దుతు తెలిపిన వారిలో ప్రతిపక్షాలు ముందు వరుసలో ఉన్నాయి. రైతుల సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించడం, ఆందోళనలు జరుగుతున్న శిబిరాల వద్దకు చేరి వారికి సంఘీభావం తెలియచేశారు కూడా. ఇక రైతులు పిలుపు ఇచ్చిన భారత్ బంద్ విజయవంతం కావడానికి విపక్షాలు ఎంతో సహకరించాయి. బీజేపీ యేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బంద్ చేసేందుకు అధికార పార్టీలే సహకరించాయి. కేంద్రం తీసుకువచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలకు రాహుల్, ప్రియాంక వంటి జాతీయ స్థాయి నేతలు నాయకత్వం వహించారు. లఖింపూర్ ఖేరి వంటి ఘటనల్లో రైతులకు పరిహారం అందించే విషయంలో కానీ, నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకునే అంశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు కీలకంగా వ్యవహరించారు. ఒక్కమాటలో చెప్పాలంటే... రైతుల ఉద్యమాన్ని విపక్షాలు సారధ్యం వహించడం వల్లే.... భారతీయ జనతా పార్టీ నేతలు కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. లేకపోతే... దీనికి మోదీ సర్కార్ అంత ప్రాధాన్యత ఇచ్చేది కాదేమో మరి.