చిన్నారుల కోసం కోటి డోసులు ఆర్డర్..!

NAGARJUNA NAKKA
మన దేశంలో చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేస్తోంది. ఈ మేరకు జైడస్ క్యాడిలా రూపొందించిన కరోనా టీకా జైకోవ్-డీ కోటి డోసులకు ఆర్డర్ చేసింది. అయితే ఒక్క డోసుపై దాదాపు 358రూపాయలు చెల్లిస్తున్నట్టు తెలిసింది. దీంతో ఈ నెలలోనే జైడస్ టీకా అందుబాటులోకి రానున్నట్టు సమాచారం. ఈ టీకాను సూది అవసరం లేకుండా మూడు డోసుల్లో 12ఏళ్లు వయసుపైబడిన వారికే ఇస్తారు.
ఇక దేశంలో గత 24గంటల్లో కొత్తగా 11వేల 451 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 266మంది మహమ్మారికి బలయ్యారు. నిన్న 13వేల 204మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం లక్షా 42వేల 826యాక్టివ్ కేసులున్నాయి. గత 24గంటల్లో నమోదైన కేసుల్లో 7వేల 124కేసులు ఒక్క కేరళలోనే నమోదు కాగా.. 2మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
ఇక దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఏవై.4.2 వ్యాప్తిపై ఇన్సాకాగ్ కీలక ప్రకటన చేసింది. ఈ వేరియంట్ వ్యాప్తి 0.1శాతం కంటే తక్కువగా ఉందని తెలిపింది. భారత్ లో ఇప్పటికీ డెల్టా వేరియంట్ మాత్రమే ఆందోళనకరంగా ఉందనీ.. ఇతర వేరియంట్లు ఆందోళనకరంగా లేవని చెప్పింది. జీనోమ్ వేరియంట్లను పర్యవేక్షించేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ కన్సార్టియంను 2020 డిసెంబర్ లో ఏర్పాటు చేశారు.
మరోవైపు ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో జికా వైరస్ వ్యాప్తి నానాటికీ పెరుగుతోంది. కొత్తగా మరో 10మందికి జికా పాజిటివ్ రాగా.. మొత్తం కేసుల సంఖ్య 89కు పెరిగింది. అయితే కాన్పూర్ తో పాటు యూపీలోని పలు ప్రాంతాల్లో జికా కేసులు పెరిగిపోతుండటంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. వైరస్ కట్టడికి అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని ఆదేశించారు.మొత్తానికి చిన్నారుల కోసం వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. భారత ప్రభుత్వం తొలివిడతగా కోటి డోసులను ఆర్డర్ చేసింది.
 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: