టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ షాక్..? ఇక ఆ పదవులు లేవు..
దాదాపు ఐదు సంవత్సరాల తరువాత పార్టీ జిల్లా కమిటీకి ఎన్నికలు రానున్నాయి. మూడెళ్ల కిందట పార్టీ జిల్లా కమిటీలను రద్దు చేసి ఎమ్మెల్యేల అధ్యక్షతన నియోజకవర్గాల కమిటీలను వేసింది. ఇప్పుడు దీంతో పాటు పార్టీలో మరింత మందికి పదవులు ఇవ్వాలనే ఆలోచనతో జిల్లా కమిటీలను పునరుద్దరించింది. ఈ నెల 21 నుంచి జిల్లా కమిటీల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా కమిటీల ప్రస్తావన రాగా ఎమ్మెల్యేలకు ఈ పదవులు ఇచ్చేది లేదని తెలిపారు.
పార్టీ ఎన్నికలను ప్రధాన కార్యదర్శులు పర్యవేక్షించనున్నారు. దీంతో జిల్లా కమిటీ ఎన్నికల ముందే స్పష్టతనిచ్చినట్టు తెలుస్తోంది. వాస్తవానికి 33 జిల్లాల్లో కొందరు ఎమ్మెల్యేలు పార్టీ జిల్లా పదవులు ఆశించారు. అయితే, అధిష్టానం తాజా నిర్ణయంతో వారికి నిరాశ మిగిలేట్టు కనిపిస్తోంది. పార్టీ జిల్లా అధ్యక్ష పదవుల ఎంపికలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలు సమన్వయంతో ఎంపిక చేయాలని నిర్ణయించింది అధిష్టానం.
పార్టీలో చురుకుగా ఉన్న సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమ నేపథ్యం తదితర అంశాలకు పరిగణలోకి తీసుకుని ఒక పదవికి నలగురు ఐదుగురి అభ్యర్థుల పేర్లను తీసుకుని అందులో ఒకరిని ఎంపికను సీఎం కేసీఆర్ ఖరారు చేస్తాడు. జిల్లా కమిటీకి అన్ని అర్హతలు ఉన్న వారినే తీసుకోవాలని అధిష్టానం నిర్ణయించినట్టు సమాచారం. ఈ నిర్ణయంతో ఎమ్మెల్యేలకు పెద్ద చిక్కు ఏర్పడిందని పార్టీలో చర్చ జరుగుతోంది.