తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి వరకు హుజురా,బాద్ ఉప ఎన్నికపై తీవ్రమైన ఉత్కంఠ సాగింది. తరువాత ఎన్నిక షెడ్యూల్ వాయిదా పడడంతో పార్టీలన్ని కాస్త చల్లబడ్డట్టుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే టీఆర్ ఎస్ బీజేపీ లు తమ అభ్యర్థిని ప్రకటించేశాయి. అయితే, కాంగ్రెస్ మాత్రం తమ అభ్యర్థి ఎంపికలో ఎలాంటి నిర్ణయం తీసుకోక తర్జన భర్జన పడుతుంది. అభ్యర్థి విషయంలో మూడు రకాల సమీకరణాలు పరిశీలిస్తుంది. బీసీ, ఎస్సీ, ఓసీ సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకుంది. బీజేపీ నుంచి ఈటల, టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్లను బరిలోకి దింపిన నేపథ్యంలో కాంగ్రెస్ కూడా బీసీ అభ్యర్థిని రంగంలోకి దింపనున్నట్టు తెలుస్తోంది.
అందులో భాగంగా బీసీ అభ్యర్థి కొండా సురేఖ, నియోజక వర్గంలో ఎస్సీ సామాజిక వర్గం కూడా అధికంగా ఉండడంతో కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ పేర్లను పరిశీలించింది. అభ్యర్థి ఎంపికలో ఏకాభిప్రాయం రాకపోవడంతో ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. కరీంనగర్ లో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వాస్తవానికి రేవంత్ టీపీసీసీ చీఫ్ అయిన నుంచి కాంగ్రెస్లో ఊపు పెరిగింది. అలాగే రేవంత్ నిర్వహించిన సభలు, కార్యక్రమాలు విజయవంతం చేసుకున్నారు.
దీంతో ప్రజల దృష్టిని తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ కొత్తకొత్త వ్యూహాలు రచిస్తోంది. కానీ ఇప్పటి వరకు హుజురాబాద్ వైపు చూడడం లేదు. చెప్పాలంటే ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్కు మంచి పట్టు ఉంది. గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన ఆ పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఈసారి టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకుని కాంగ్రెస్కు షాక్ ఇచ్చాడు. అయితే, పార్టీకి క్యాడర్ ఉన్నా పోటీలో నిలబడేందుకు బలమైన అభ్యర్థి లేకపోవడంతో వెతుకులాటను ప్రారంభించింది.
ఇప్పుడు రేవంత్ రెడ్డికి హుజురాబాద్ ఉప ఎన్నిక విషయం కీలకంగా మారింది. పార్టీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలి ఎన్నికలు కావడంతో ఎలాగైన గెలవాలనే పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. దీని కోసం కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్తో సమావేశం నిర్వహించింది.
అయితే, హుజురాబాద్ అభ్యర్థిపై కాంగ్రెస్ పార్టీ క్లారిటీగా లేకపోయిన కొండా సురేఖకు టికెట్ ఖాయమని ఆమె మాటల ద్వారా అవగతం అవుతున్నది. బీసీ, ఎస్సీ, ఓసీ సామాజిక వర్గాలను ఆకర్షించడానికి రేవంత్ ప్లాన్ చేస్తున్నారట. కొండా సురేఖ బీసీతో పాటు మహిళ కావడం, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ పార్టీ చీఫ్ ఉండడంతో ఆయన సామాజిక వర్గం కూడా కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో రేవంత్ హుజురాబాద్ పై ఓ క్లారిటీగా ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.