తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల చూపు, నాయకులు చూపు, ప్రజల చూపు మొత్తం హుజురాబాద్ పైనే వాలి పోయింది అని చెప్పవచ్చు. ఒకప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి నియోజకవర్గాలు అన్నింటిలో హుజురాబాద్ ఒకటి మాత్రమే. అన్ని నియోజకవర్గాల లాగే అక్కడ కూడా ఎన్నికలు జరిగేవి. కానీ ప్రస్తుత పరిణామాలతో హుజురాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ రాబోవు రాజకీయాలలో ఒక మైలు రాయిగా నిలవనుంది. హుజురాబాద్ ఉప ఎన్నిక పుణ్యమా అని రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల్లో చలనం వచ్చింది. ముఖ్యంగా అధికార తెరాస పార్టీ నాయకులంతా రాష్ట్రంలో ప్రజలకు కనబడుతున్నారు. అభివృద్ధి పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. ఇక హుజురాబాద్ విషయానికి వస్తే అక్కడ చీమ చిటుక్కుమన్నా నాయకులు వచ్చి వాలిపోతున్నారు. సమస్య ఏదైనా క్షణాల్లో అధికారులను పిలిపించి ఆ సమస్యను సాల్వ్ చేస్తున్నారు. దళిత బంధు పథకం కూడా ఈ ఉప ఎన్నిక ఈ సందర్భంగానే తీసుకొచ్చారని చెప్పవచ్చు.
ఇంకా ప్రభుత్వం అనేక స్కీమ్ లతో ముందుకు పోతోంది. ఇదంతా హుజురాబాద్ సెగ్మెంట్లో గెలవడమే కాకుండా వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా పట్టు సాధించడం కోసం అధికార తెరాస పార్టీ పనిచేస్తుందా..? ఈ దళిత బందు లాంటి పథకాన్ని చూస్తే ఇటు హుజురాబాద్ మళ్లీ రాబోయే ఎన్నికల కొరకే ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకు వస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత పరిణామాల్లో రాష్ట్రంలోని అన్ని పార్టీల నాయకులు హుజురాబాద్ లోనే ఉండి తమ తమ పార్టీలను గెలిపించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. హుజురాబాద్ సెగ్మెంట్లో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో వందల మంది నాయకులు వచ్చి ప్రచారం చేసినా దాఖలాలైతే ఇప్పటివరకు లేవు. హుజురాబాద్ ఉప ఎన్నిక పుణ్యమా అని, వందల మంది నాయకులు, వేల వ్యూహాలతో తమ తమ మాటలతో హుజురాబాద్ లో చుట్టేస్తున్నారు.
హుజురాబాద్ లో ఎటు చూసినా పెద్దపెద్ద మైకులతో ప్రచార ఆర్భాటాలు, ఎవరి మెడలో చూసినా ఆయా పార్టీల కండువాలు, పెద్ద పెద్ద హోర్డింగులు, ఫ్లెక్సీలు ఆయా పార్టీల జెండాలు ఎక్కడ చూసినా గుంపులుగుంపులుగా జనాలు ప్రస్తుత పరిణామంతో హుజురాబాద్ ఒక పండగ వాతావరణంలా కనిపిస్తోంది. ఎన్ని పార్టీలు ఎన్ని ప్రచారాలు చేసినా ప్రజల నాడిలో ఎవరున్నారో ఆ అభ్యర్థి మాత్రమే గెలుపు తీరాలకు వెళ్తారని చెప్పవచ్చు.