అమెరికాలో ఉద్యోగం చేయాలంటే ఇక అది తప్పనిసరి..?
కరోనా మహమ్మారి విజృంభణ తగ్గడంతో అమెరికాలోనూ సాధారణ జన జీవనం ప్రారంభమైంది. అయితే.. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే.. మళ్లీ మహమ్మారి విజృంభించే అవకాశం ఎప్పుడైనా ఉంటుంది. అందుకే అమెరికా తన దేశంలోని అన్ని వ్యాపార సంస్థలు జనవరి 4 నాటికి కొవిడ్ టీకా తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంటే.. వాణిజ్య సంస్థలన్నీ ఉద్యోగులు, కార్మికులకు టీకాలు వేయించాల్సిందే అన్నమాట. జనవరి 4లోపు వాణిజ్య సంస్థల్లో వ్యాక్సినేషన్ పూర్తి కావాలని అమెరికా ఆదేశిస్తోంది.
ఈ కొత్త ఆదేశాల ప్రకారం.. జనవరి 4 తర్వాత వ్యాక్సినేషన్ చేయించుకోని వారికి అమెరికాలో ఉద్యోగం చేసే అవకాశం ఉండదన్నమాట. అంతే కాదు.. ఏదైనా సంస్థలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులు అందరికీ వ్యాక్సినేషన్ ఉన్నట్టు ధ్రువపత్రం పొందితేనే ఆ సంస్థ కార్యకలాపాలకు అనుమతిస్తారు. ఆ సర్టిఫికెట్ లేకపోతే.. ఆ సంస్థను మూసేస్తారు.. ఏమాత్రం ఉదాసీనంగా ఉన్నా మళ్లీ కరోనా మూడో వేవ్ వచ్చే ఛాన్సు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న సమయంలో అమెరికా ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే కరోనా బారిన పడి ఎక్కువగా నష్టపోయిన దేశాల్లో అమెరికా కూడా ఒకటి. కరోనా మొదటి, రెండో వేవ్లలో అమెరికా చాలా ఇబ్బందిపడింది. ఒక దశలో లక్షల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. రోజూ వేల మంది కరోనాతో చనిపోయేవారు. ఇప్పుడు ఉధృతి తగ్గినా.. అప్రమత్తత కొనసాగించాలని అమెరికా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.