ఇటీవల కేంద్రం ప్రకటించిన జాతీయ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు గెల్చుకున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ అంధధూన్ ఇప్పుడు కోలీవుడ్ లో రీమేక్ కానుంది. ఈ రీమేక్ లో ప్రశాంత్ హీరో గా నటించనున్నాడు. అయితే ప్రశాంత్ హీరో అనే సరికి తమిళ ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి సినిమాకు ధనుష్ లేదా సిద్దార్థ్ అలాంటి వాళ్ళు సరిపోతారు. కానీ ఇప్పుడు ప్రశాంత్ రీమేక్ చేయడమేంటి? ఈసినిమాను వాళ్ళు చెడగొడతారు.. అంటూ విమర్శించారు. అయితే విమర్శలను పట్టించుకోని ప్రశాంత్ ఈసినిమా కోసం చాలానే కష్ట పడుతున్నారు. అందులో భాగంగా ఈసినిమా కోసం ఏకంగా 20 కిలోల బరువు తగ్గాడు. ఒరిజినల్ వెర్షన్ లో హీరో పియానో ప్లేయర్ కావడం అలాగే ప్రశాంత్ కు కూడా నిజ జీవితంలో పియానో విద్య తెలిసివుడండంతో ఈపాత్ర అతని కి సరిపోతుందని ప్రశాంత్ తండ్రి , ప్రముఖ నిర్మాత త్యాగరాజన్ భారీ పోటీ నడుమ అంధధూన్ రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నాడు. అయితే ఈసినిమా కు ఇంకా దర్శకుడు , మిగతా నటీనటులను ఎంపిక చేయాల్సి వుంది.
కాగా గత ఏడాది బాలీవుడ్ లో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది అంధధూన్. కామెడీ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించగా టబు , రాధికా ఆప్టే ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక ఈ చిత్రం ఈ ఏడాది సమ్మర్లో ' పియానో ప్లేయర్' అనే టైటిల్ తో చైనా లో విడుదలై 200కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సంచనలన విజయాన్ని సాధించింది. ఇక అంధధూన్ ను ప్రస్తుతం తెలుగులో కూడా రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలుగు వెర్షన్ లో నాని హీరోగా నటించనున్నాడని ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ ఈవిషయంలో ఇంకా క్లారిటీ రావాల్సింది వుంది.