గత కొన్నేళ్లుగా టాప్ హీరోల సినిమాలతో పోటీ పడి మరి సూపర్ హిట్లు కొట్టిన యంగ్ హీరో శర్వానంద్ వరుసగా మరో ఫ్లాప్ కొట్టాడు. పడి పడి లేచే మనసు తర్వాత చాలా ఆశలతో చేసిన రణరంగం సినిమా అతడికి హిట్ అందించలేకపోయింది. గత శుక్రవారం అడవి శేష్ ఎవరు సినిమాతో పోటీ పడి థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు రిలీజ్కు ముందే బజ్ లేదు.
శర్వానంద్ కూడా సినిమాపై ఆసక్తి లేకనో ఎందుకనో అస్సలు పట్టించుకోలేదు. ఇక వారం రోజులు పూర్తి చేసుకున్న రణరంగం డిజాస్టర్ అయ్యింది. వారం రోజుల వసూళ్లు చూస్తే ఏపీ, నైజాంలో ఈ సినిమాకు 9 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. అటు సినిమాను 17 కోట్ల రూపాయలకు అమ్మారు. విడుదలైన తొలి రోజే రూ. 4 కోట్ల షేర్ రాగా.. ఆ తర్వాత సినిమా పూర్తిగా తేలిపోయింది.
మరో వైపు అడవి శేష్ ఎవరు థియేటర్లలో దూసుకుపోయింది. మంగళ, బుధవారాలు ఆక్యుపెన్సీ అస్సల్లేదు. అలా 9 కోట్ల రూపాయల వద్దే ఆగిపోయింది రణరంగం. ఇక రెండో వారంలోకి వచ్చిన వెంటనే చాలా చోట్ల ఈ సినిమాను లేపేశారు. అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా డిజాస్టర్ అయింది. ట్రేడ్ వర్గాలు కూడా సినిమాను డిజాస్టర్గా తేల్చేశాయి.
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కింది రణరంగం సినిమా. ఈ నిర్మాతలకు బయ్యర్లకు మంచి సంబంధాలున్నాయి. అందుకే నష్టపోయిన బయ్యర్లను ఆదుకునేందుకు ఇప్పటికే ప్రణాళిక సిద్ధంచేశారు ఈ నిర్మాతలు. కోల్పోయిన మొత్తంలో 50 శాతాన్ని భర్తీచేయబోతున్నారు. సుధీర్వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమా రిలీజ్ అయిన రెండో రోజే శర్వానంద్ సినిమా కథలో బలం లేకపోయినా స్క్రీన్ ప్లే నచ్చి చేశాననడం కూడా వసూళ్లపై ప్రభావం చూపిందంటున్నారు.