ఆ మద్య తెలుగు ఇండస్ట్రీలో ‘ప్రేమించుకుందాం రా’, ‘ఈశ్వర్’, ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులని అలరించిన ప్రముఖ దర్శకుడు జయంత్ సి పరాన్జీ. దర్శకుడు జయంత్ ఒకప్పుడు సూపర్ హిట్ చిత్రాలు అందించినా కొంత కాలంగా హిట్స్ లేక ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ప్రస్తుతం తాను నరేంద్ర అనే టైటిల్తో మూవీ తెరకెక్కించబోతున్నట్టు చిత్ర బృందం తెలిపింది.
ఈ చిత్రంతో ప్రముఖ భారత రెజ్లర్ దలీప్ సింగ్ రాణా( ది గ్రేట్ ఖలీ) తొలిసారిగా టాలీవుడ్కి ఎంట్రీ ఇస్తున్నారు. నీలేష్ హీరోగా నటించనుండగా, ఆయన సరసన ‘మిస్టర్ మజ్ను’ చిత్రంలో నటించిన బ్రెజిలియన్ మోడల్, నటి ఇసబెల్ లీత్ ఇందులో కథానాయికగా నటిస్తున్నారు.
యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈషన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై తెరకెక్కుతోంది. గంటా రవితేజను హీరోగా పరిచయం చేస్తూ చివరిగా జయదేవ్ అనే చిత్రాన్ని జయంత్ సి పరాన్జీ తెరకెక్కించిన సంగతి తెలిసిందే.ఈ చిత్రంలో డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ ద గ్రేట్ ఖలీ కీలక పాత్రలో నటిస్తుండడంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.