తెలుగు తెరకు `అఆ` సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మలయాళీ భామ అనుపమా పరమేశ్వరన్ తెలుగువారి అభిమానాన్ని సంపాదించింది. ఇప్పటి వరకు అనుపమ ప్రతి సినిమాలోనూ చాలా సాంప్రదాయంగా కనిపిస్తూ వచ్చింది. తాజాగా సాయిధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ‘తేజ్ ఐ లవ్ యూ’ సినిమా శుక్రవారం రిలీజ్ కాబోతుంది. ఈ సందర్బంగా ప్రమోషన్ వర్క్ లో పాల్గొంటున్న ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. `కొన్ని కారణాల వల్ల నాకు అన్నీ సినిమాల్లోనూ ఒకే తరహా పాత్రలు వస్తున్నాయి.
నేను గ్లామరస్ పాత్రలకు సిద్ధమే. అసభ్యంగా అనిపించనంతవరకు గ్లామర్గా కనిపించడానికి నాకేం అభ్యంతరం లేదు. గ్లామర్కు, అసభ్యతకు మధ్యనున్న హద్దు గురించి నాకు తెలుసు` అని అనుపమ వ్యాఖ్యానించింది. రంగస్థలం సినిమాలో సమంత పోషించిన రామలక్ష్మి పాత్ర కోసం తొలుత తననే చిత్ర బృందం సంప్రదించినట్లు నటి అనుపమ పరమేశ్వరన్ వెల్లడించింది. ‘అఆ’ సినిమా చేసేటప్పుడు త్రివిక్రమ్ తెలుగు నేర్పించడంతో.. తనకు భాషపరంగా ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేవని వెల్లడించిన అనుపమ.. ‘తేజ్ ఐ లవ్ యూ’ సినిమాని దర్శకుడు కరుణాకరన్ చాలా బాగా తెరకెక్కించాడని కితాబిచ్చింది.
రంగస్థలంలోని రామలక్ష్మి పాత్ర కోసం తొలుత నన్నే సంప్రదించారు. కానీ.. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చేయలేకపోయా. ఆ తర్వాత సినిమా చూశాను. సమంత చాలా బాగా నటించింది. రామలక్ష్మి పాత్రకి తను మాత్రమే న్యాయం చేయగలదు అనిపించింది.. ఆ విషయాన్ని దర్శకుడు సుకుమార్కి కూడా చెప్పాను. మహానటి సినిమాలో కీర్తి సురేశ్ కూడా చక్కగా నటించింది. ఇలాంటి పాత్రలు తెరపై చూసినప్పుడు నటిగా నేను స్ఫూర్తి పొందుతా. ప్రస్తుతం తెలుగుపరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. ఇండస్ట్రీలో గ్లామర్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ఈ అమ్మడు కూడా గ్లామర్ కే జై అంటుంది.