ఇంత వరకూ సినిమా స్టార్ల జీవితాలను సినిమాలుగా తీసి సొమ్ము చేసుకొన్నారు నిర్మాతలు. ఇప్పుడు అలాంటి కథలన్నీ అయిపోయాయి. చూసీ చూసి ప్రేక్షకులకీ బోర్ కొట్టేసింది. ఆ తరవాత క్రికెటర్లపై పడ్డారు. అక్కడా ఖేల్ ఖతమ్ అయ్యింది. ఇప్పుడు రాజకీయనాయకుల కథలు వాళ్లని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులను సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశం అణువణువూ కనిపిస్తోంది.
సీనియర్ దర్శకులు పిసిరెడ్డి కూడా పొలిటికల్ నేపథ్యంలో ఓ సినిమా తీయబోతున్నారట. ఆ సినిమా పేరేమిటో తెలుసా?? జగన్నాయకుడు.ఇది మూడు తరాల కథ అట. తాత, తండ్రి, కొడుకు.. ఇలా సాగుతుందట ఆ సినిమా. తాత ఆశయాన్ని మనవడు ఎలా నెరవేర్చాడో ఈ సినిమాలో చూపిస్తారట. ఇది కచ్చితంగా వైఎస్ రాజశేఖర్రెడ్డి, తనయుడు జగన్మోహనరెడ్డి కథే అనే టాక్ పరిశ్రమలో బాగా వ్యాపించింది. పేరు కూడా జగన్ని స్ఫురించేలానే వినిపిస్తోంది.
కథ ఇప్పటికే సిద్ధమైందట. ఈ సినిమాని త్వరలోనే సెట్స్పైకి తీసుకెళ్తారట. వైఎస్ఆర్ కథని సినిమాగా తీద్దామని చాలామంది ప్రయత్నించారు. అయితే.. ఆ ప్రయత్నాలు సఫలీకృతం కాలేదు. కొన్ని మధ్యలోనే ఆగిపోతే మరికొన్ని స్ర్కిప్టు దశ దగ్గరే నత్తనడకలు నడుస్తున్నాయి. మరి ఈ సినిమా అయినా వస్తుందో రాదో చూడాలి.