తెరకెక్కబోతున్న టాలీవుడ్ క్రేజీ సీక్వెల్స్ పైనే అందరి చూపు?

Suma Kallamadi
టాలీవుడ్ గత దశాబ్ద కాలం నుండి మంచి స్వింగ్ లో దూసుకుపోతోంది. దాదాపు ఇండియన్ పరిశ్రమలోనే ఇపుడు తెలుగు చిత్ర పరిశ్రమం టాప్ లో ఉంది అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇంకా చెప్పాలంటే మన తెలుగు సినిమాలు ఇపుడు ప్రపంచ సినిమాని శాసిస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. దానికి నాంది పలికింది మాత్రం దర్శకుడు రాజమౌళి అని మనం సగర్వంగా చెప్పుకోవాలి. ఇక తాజా కల్కి సినిమాతో నాగ్ అశ్విన్ తెలుగు సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఇక్కడ ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. అందులో ఎక్కువగా తెలుగు దర్శకులు ఇపుడు ఆల్రెడీ హిట్టయిన సినిమాలకి సీక్వెల్స్ తీసే ఆపనిలో పడినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో డజనుకు పైగా సీక్వెల్స్ తెరకెక్కుతున్నాయి అని సమాచారం. అందులో మొదటిది అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'పుష్ప: ది రూల్'. దీనికి మొదటి భాగంగా వచ్చిన 'పుష్ప: ది రైజ్' బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన  సంగతి అందరికీ తెలిసినదే. కాగా దీని సెకండ్ పార్ట్ 2024 డిసెంబర్ 6న రిలీజ్ కానుంది. దీని తరువాత చెప్పుకోదగ్గది ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో రూపొందిన 'కల్కి 2898 AD' చిత్రం. ఈ సినిమా ప్రస్తుతానికి రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కాగా ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ ఈ సైన్స్ ఫిక్షన్ మూవీకి సీక్వెల్ గా 'కల్కి 2' ను ప్రకటించారు. అదేవిధంగా ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'సలార్ పార్ట్-1: సీజ్ ఫైర్'. దీనికి కొనసాగింపుగా 'సలార్ పార్ట్-2: శౌర్యంగ పర్వం' చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది.
తరువాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న సినిమా 'డబుల్ ఇస్మార్ట్' సినిమా 'ఇస్మార్ట్ శంకర్' చిత్రానికి సీక్వెల్ అన్న సంగతి అందరికీ తెలిసినదే. కాగా ఈ సినిమా ఆగస్టు 15వ తారీఖున విడుదల కాబోతోంది. అదేవిధంగా నందమూరి కళ్యాణ్ రామ్, దర్శకుడు వశిష్ట కలిసి చేసిన సోసియో ఫాంటసీ మూవీ 'బింబిసార' సినిమాకి ప్రీక్వెల్ గా ఇటీవల 'బింబిసార 2' చిత్రాన్ని అనౌన్స్ చేసిన సంగతి విదితమే. అయితే ఈ సినిమాకి అనిల్ పాదూరి దర్శకత్వం వహించనున్నారు. ఇక ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తేజ సజ్జతో తీసిన 'హను-మాన్' సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. కాగా ఈ చిత్రానికి ఇపుడు సీక్వెల్ గా 'జై హనుమాన్' అనే చిత్రం తెరకెక్కుతోంది.
అదేవిధంగా సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన 'డీజే టిల్లు'కి సీక్వెల్ గా వచ్చిన 'టిల్లు స్క్వేర్' సినిమా మంచి విజయం సాధించింది. ఈ క్రమంలో మూడో సినిమాగా 'టిల్లు క్యూబ్' రాబోతోంది. అలాగే నాని నిర్మాణంలో శైలేష్ కొలను దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా 'హిట్' ప్రాంచైజీ మొదలైంది. అడవి శేష్ తో చేసిన 'హిట్ 2' కూడా హిట్టవ్వడంతో, ఇప్పుడు నాని ప్రధాన పాత్రలో 'హిట్ 3: ది థర్డ్ కేస్' చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ కి అంతే ఉండదు... ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. కొన్నాళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవి నటించిన 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమాకి సీక్వెల్ చేయబోతున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి. అయితే దీని గురించి ఇంకా అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: