తిరుమలలో నిర్మాత దగ్గుబాటు సురేష్ వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో ట్రోలింగ్

Suma Kallamadi

టాలీవుడ్‌లో దగ్గుబాటి కుటుంబం తొలి నుంచి వివాదాలకు దూరంగా ఉంటుంది. అందులోనూ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాగా సౌమ్యుడు. మంచి సినిమా తీసి ప్రేక్షకులకు అందించాలనే తపనతోనే ఆయన పని చేస్తూ ఉంటారు. అవసరమైతే కొత్త వారికి సైతం ఆయన ఛాన్స్‌లు ఇస్తుంటారు. ఇలా టాలెంట్‌ను ప్రోత్సహించడంలో ఆయన ముందుంటారు. ఇలా వివాదాలకు దూరంగా ఉండే ఆయన ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌కు గురవుతున్నారు. దీనికి కారణం ఆయన చేసిన కామెంట్స్ మాత్రం కాదు. కానీ కామెంట్స్ చేసిన ప్రాంతమే ఇందుకు కారణం. దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.
నిత్యం తిరుమల వేంకటేశ్వర స్వామిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకుంటారు. నిర్మాత సురేష్ బాబు సైతం ఇటీవల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ సమయంలో ఆయనతో పాటు వెంట సినీ దర్శకుడు గోపీచంద్ మలినేని, సంగీత దర్శకుడు థమన్ సైతం ఉన్నారు. వీరంతా స్వామి వారిని దర్శించుకుని బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడారు. కమల్ హాసన్ హీరోగా, దర్శకుడు శంకర్ తెరకెక్కించిన భారతీయుడు-2 సినిమాపై నిర్మాత సురేష్ బాబు స్పందించారు. దీనిని తెలుగులో తాము విడుదల చేస్తున్నట్లు చెప్పారు. సినిమా టికెట్ల రేట్ల విషయంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నాయన్నారు. టికెట్ల రేట్లు పెంపు విషయమై ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌తో చర్చించామని, దీనికి సంబంధించి అందరికీ అనుకూలంగా ఒక జీవో తెచ్చేలా కృషి చేస్తానని ఆయన హామీనిచ్చారని పేర్కొన్నారు. అయితే చిత్ర పరిశ్రమ చేయాల్సిందల్లా ఒకటేనని, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా సినిమాలు తీయాలని పేర్కొన్నారు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా సినిమాలు ఉంటే బాగుటుందని తన అభిప్రాయాన్ని ఆయన వెలిబుచ్చారు. అదే తమ లక్ష్యమని, అందుకు అనుగుణంగా ప్రణాళికలు వేస్తున్నామని చెప్పారు. ఆయన మాటల్లో ఎక్కడా తప్పు లేదు. అయితే శ్రీవారి సన్నిధిలో రాజకీయాలు కానీ, ఇతరత్రా విషయాలు కానీ మాట్లాడకుండా ఉంటే బాగుండేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయాన్ని మర్చిపోయి ఆయన సినిమాల గురించి మాట్లాడారని కొందరు ట్రోల్ చేస్తున్నారు. తిరుమలలో ఇటీవల కొందరు రాజకీయ నేతలు తాము ఇక్కడ ఎలాంటి విషయాలు మాట్లాడబోమని స్పష్టం చేశారు. దానిని చాలా మంది ప్రశంసించారు. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే ప్రాంతంలో సినిమాలు, రాజకీయాలు మాట్లాడడం తగదని సూచిస్తున్నారు. సురేష్ బాబు కామెంట్లపై సోషల్ మీడియాలో పనిగట్టుకుని కొందరు ఈ విషయంపై ట్రోలింగ్ చేస్తున్నారు. దీంతో ఎప్పుడూ వివాదాలకు, వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉంటే నిర్మాత సురేష్ బాబు ట్రోలింగ్ చేసే వారికి చిక్కారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: