రౌడీ హీరో విజయ్ దేవరకొండ రీసెంట్ గా ‘ఫ్యామిలీ స్టార్’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ‘గీత గోవిందం’ మూవీ ఫేమ్ పరశురామ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టాలను కొంతవరకు ఆకట్టుకునేలా చూపించడంతో ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది తప్పితే విజయ్ దేవరకొండ రేంజ్ హిట్ అవ్వలేదు. దీంతో ఫ్యాన్స్ విజయ్ దేవరకొండ తదుపరి ప్రాజెక్ట్ పై ఆశలు పెట్టుకున్నారు. విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ మూవీని ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో చేయబోతున్న విషయం తెలిసిందే. ఇందులో విజయ్ కి జోడీగా భాగ్య శ్రీ భోర్సే నటిస్తోంది. ఇటీవలే విశాఖపట్టణంలో ఓ కీలక షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా కొత్త షెడ్యూల్ శ్రీలంకలో ప్రారంభిం చేందుకు యూనిట్ రెడీ అవుతోంది. అక్కడ జరిగే లాంగ్ షెడ్యూల్ ఇది. దాదాపు 40 రోజుల పాటు శ్రీలంకలోనే షూటింగ్ నిర్వహిస్తారు.భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు మరికొన్ని చిత్రీకరించను న్నారు. సినిమాలో ఈ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ కావడంతోనే అక్కడి లొకేషన్లలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాల్సి రావడంతో యూనిట్ వెళ్తుంది. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అయితే రెండవ భాగం కథకి...శ్రీలంక నేపథ్యానికి చాలా దగ్గర సంబంధం ఉందంటున్నారు. మరి ఆ సంగతేంటో తెలియాలి.అయితే ఈ సినిమా షూటింగ్ చాలా నెమ్మదిగా జరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్ ప్రకటించిన చాలా కాలానికి సెట్స్ కి తీసుకెళ్లారు. షూటింగ్ మొదలైన తర్వాత వేగంగా జరగలేదు. అందుకు దర్శకుడు పనితీరు కూడా ఓ కారణం. గౌతమ్ మేకింగ్ స్లోగా ఉంటుందని, సమయం ఎక్కువగా తీసుకుంటారనే విమర్శ ఉంది. ఆ కారణంగా బడ్జెట్ కూడా పెరుగుతుంది.
జెర్సీ షూటింగ్ సమయంలో ఇదే విమర్శ తెరపైకి వచ్చింది. మరి విజయ్ సినిమా ఎప్పుడు పూర్తవుతుంది? అన్నది తెలియాలి. అయితే మేకర్స్ ఆగస్టు చివరకిల్లా పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లు సమాచారం. సినిమాకి పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా ఎక్కువగానే సమయం పడుతుందని చిత్రవర్గాలు భావిస్తున్నాయి. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తుంది. గౌతమ్ తిన్ననూరి గత సినిమా జెర్సీ కూడా ఇదే బ్యానర్ లో నిర్మాణమైన సంగతి తెలిసిందే.కాగా ఈ సినిమాకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో పాటలు ఉండవట. కాకపోతే థీమ్ మ్యూజిక్ కి ఇంపార్టెన్స్ ఉంటుందట. అంటే లోకేష్ కనగరాజ్ ‘ఖైదీ’ సినిమాలా అన్నమాట. ‘ఖైదీ’ సినిమాలో అసలు పాటలే ఇండవు. కేవలం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తోనే సినిమా ఆడియన్స్ ని ఆకట్టుకుంది.ఇప్పుడు విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్జ్ట్ కూడా ఇదే తరహాలో ఉంటుందని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. సినిమాలో విజయ్ దేవరకొండ పోషిస్తున్న పాత్ర, సినిమా కథనం ఎంతో ప్రత్యేకంగా ఉంటాయని అంటున్నారు. ఈ రెండింటి మీదే సినిమా అంతా సాగనుండటంతో ఇందులో పాటలకి చోటు లేదని తెలుస్తోంది. కాకపోతే థీమ్ మ్యూజిక్ మాత్రం సినిమా సోల్ కి తగ్గట్లుగా ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ థీమ్ మ్యూజిక్ ని అనిరుద్ రవిచంద్రన్ కంపోజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘జెర్సీ’ మూవీకి అనిరుద్ ఇచ్చిన అల్బమ్, బీజీఎమ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు దానికి మించి ‘VD12’ ప్రాజెక్ట్ థీమ్ మ్యూజిక్ ఉనుండనున్నట్లు సమాచారం.