రౌడీ పై మళ్ళీ ట్రోల్స్ ?
టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండకు యూత్లో మంచి క్రేజ్ వుంది. అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ తర్వాత పలు చిత్రాలతో మెప్పించిన విజయ్ దేవరకొండ ఇటీవల మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్గా మారాడు. వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రం లైగర్. భారీ అంచనాల మధ్య ఆగస్టులో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల్ని నిరాశపరిచింది. లైగర్ ఫ్లాప్ తర్వాత విజయ్ తొలిసారిగా సైమా అవార్డ్స్ 2022లో పాల్గొన్నారు. యూత్ ఐకాన్ ఆఫ్ ది సౌత్ ఇండియన్ సినిమా అవార్డును అందుకున్నారు. అవార్డు అందుకున్న అనంతరం లైగర్ వైఫల్యాలను ప్రస్తావిస్తూ విజయ్ ఉద్వేగానికి లోనయ్యారు.''ఈ వేదికపై అవార్డులు అందుకున్న అందరికీ కృతజ్ఞతలు. గొప్ప సినిమాలు, అద్భుతమైన పెర్ఫామెన్స్తో మీరు ఈ సంవత్సరం సినీ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లారు. నేను కూడా ఇండస్ట్రీకి హిట్ ఇద్దామనుకున్నాను. అందుకు చాలా ప్రయత్నించాను. కానీ అది సరిపోలేదు. మనందరికీ మంచి, చెడు రోజులు వస్తూ ఉంటాయి.
ఏ రోజుల్లోనైనా.. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా మనం చేయాల్సిన పనులు కచ్చితంగా, చాలా జాగ్రత్తగా పూర్తి చేయాల్సి ఉంటుంది.ఈ వేడుకకు రాకూడదనుకున్నాను. కానీ మీ అందరికీ ఓ విషయం చెప్పాలని వచ్చాను. మీ అందరిని ఎంటర్టైన్ చేస్తానని మాటిస్తున్నాను." అంటూ చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.దీనిపై కొందరు నెగెటివ్ కామెంట్స్ చేస్తూ తెగ ట్రోల్ చేస్తున్నారు. బడాయి తగ్గిస్తే బాగు పడతావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం విజయ్ ఖుషి సినిమాలో నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో సమంత కథానాయికగా నటిస్తోంది. మరి చూడాలి విజయ్ తరువాత సినిమా నుంచి అయినా తన పద్ధతి మార్చుకొని బడాయి తగ్గించుకుంటాడో లేడో.