ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్‌తోనే ప్రభాస్ సినిమా?

Suma Kallamadi
యంగ్ డైరెక్టర్ సుజీత్‌ ప్రభాస్ తో కలసి సాహో సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో కళ్ళు చెదిరే గ్రాఫిక్స్ తో.. కేక పుట్టించే ఫైట్లతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా దురదృష్టవశాత్తు డిజాస్టర్ అయ్యింది. హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాని తెరకెక్కించినప్పటికీ.. మంచి కథ లేకపోవడంతో సినిమా నిరాశపరిచింది. అందులోనూ బాహుబలి తర్వాత వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాంతో ఆ భారీ అంచనాల నడుమ సినిమా డిజాస్టర్ గా మిగిలింది.
అయితే గ్లోబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నప్పటికీ.. విజయవంతం కాలేక పోయారు. ఈ అట్టర్ ఫ్లాప్ తో మళ్లీ ప్రభాస్ తో కలిసి చేసే అవకాశం వస్తుందో లేదో అని అతను నిరాశలో మునిగిపోయినట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం కూడా అందింది. అయితే తాజా నివేదిక ప్రకారం ప్రభాస్ సుజీత్‌ కు బంపర్ ఆఫర్ ఇచ్చారట. సాహో సినిమా సమయంలోనే సుజీత్‌ హార్డ్ వర్క్ చూసిన ప్రభాస్ మంత్రముగ్ధులయ్యారట. మంచి కథతో సుజీత్‌ తన దగ్గరకు వస్తే మళ్లీ సినిమా చేయాలని ప్రభాస్ నిర్ణయించుకున్నారట. అయితే తాజాగా సుజీత్‌ మంచి బలం ఉన్న కథతో ప్రభాస్ ను ఆశ్రయించారట. విక్రమార్కుడు, దూకుడు లాంటి పవర్ ఫుల్ పోలీస్ స్టోరీ వినిపించడంతో ప్రభాస్ సుజీత్‌ తో కలసి మళ్లీ సినిమా చేసేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని వినికిడి.
అయితే సినిమా స్క్రిప్టు మొత్తం రెడీ చేసిన తర్వాత.. మళ్లీ ప్రభాస్ వింటారట. ఫైనల్ అవుట్ పుట్ ఎలా ఉందో తెలుసుకున్న తర్వాతనే ప్రభాస్ అధికారికంగా సుజీత్‌ తో మూవీ ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆది పురుష్, సలార్ సినిమాల చిత్రీకరణలతో ప్రభాస్ చాలా బిజీగా ఉన్నారు. ఈ సినిమాల తర్వాత అతను ఒక సై-ఫై థ్రిల్లర్ మూవీ ప్రారంభించనున్నారు. ఈ మూడు సినిమాలు పూర్తయిన తర్వాతనే సుజీత్‌ మూవీకి డేట్స్ కేటాయించే అవకాశం ఉంది.  ‘లూసిఫర్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసే అవకాశాన్ని తొలుత సుజీతే దక్కించుకున్నారు. కానీ మలయాళం స్క్రిప్ట్ ను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా చేంజ్ చేయలేక అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: