టాలీవుడ్ ఇప్పుడిపుడే మళ్ళీ కళకళలాడుతోంది. కరోనా కారణంగా రెండు సంవత్సరాల నుండి సరైన ఎంటర్ టైన్మెంట్ లేక ప్రేక్షకులు బాగా ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా థియేటర్ లో సంతోషంగా సినిమా చూసి ఎన్ని రోజులయిందో. అయితే వీటన్నింటికీ శుభం కార్డు పడేలా కరోనా కాస్త గ్యాప్ ఇచ్చింది. ఈ గ్యాప్ ను సరిగ్గా ఉపయోహించుకుంటున్నారు టాలీవుడ్ సినీ నిర్మాతలు మరియు దర్శకులు. ఇప్పటికే షూటింగ్ మధ్యలో ఆగిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటూ, కొత్త ప్రాజెక్టులను సైతం లైన్ లో పెడుతున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాల విడుదల తేదీలను ప్రకటించగా, మరి కొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అయితే పూరి జగన్నాధ్ ఇప్పటికే విజయ్ దేవరకొండతో లైగర్ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. అయినా కానీ మరో సినిమాను ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
టాలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉన్న అల్లు అర్జున్ తో సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా సినిమా వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. కానీ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత కొరటాల శివతో ఒక సినిమా అధికారికంగా ప్రకటించగా, మరో సినిమా వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ తో చేయనున్నట్లు తెలుస్తోంది. దీని బట్టి చూస్తే వచ్చే ఏడాది ద్వితీయార్థంలో వీరి సినిమా పట్టాలెక్కేలా ఉంది. ఇప్పటి నుండే కథను సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. పూరి మంచి మాఫియా బ్యాక్ గ్రౌండ్ కథను రాస్తున్నాడట, అల్లు అర్జున్ కి ఈ కథ సరిగ్గా సూట్ అవుతుందని అనుకుంటున్నాడు.
లైగర్ షూటింగ్ అయ్యాక పూరి బన్నీని కలిసి కథ చెప్పొచ్చని భోగట్టా. మరి ఈ కథకు అల్లు అర్జున్ ఓకే చెబుతారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది మూడవ సినిమా కావడం విశేషం. కెరీర్ ఆరంభంలో దేశముదురు తో మంచి హిట్ అందించాడు. ఆ తరువాత ఇద్దరు అమ్మాయిలతో సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వడంలో విఫలమయింది.