సీరియల్గా కూడా పనికిరాదన్నారు.. కానీ సినిమా తీస్తే ఇండస్ట్రీ రికార్డు కొట్టింది
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఓ కల్ట్ క్లాసిక్ సినిమా.. ఆ నలుగురు. ఈ మాటను ఇప్పటికీ ఎవరూ కాదనలేదు. మదనపల్లి సమీపంలోని కొత్తకోటలో జరిగిన ఓ యదార్థ సంఘటనకు తార్కాణంగా ఈ చిత్రం తెరకెక్కింది. అక్కడ ఓ వ్యక్తి జీవితంలో జరిగిన యదార్థ సంఘటన.. దర్శకుడు మదన్కు ఎంతో ఆవేదన, ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ వ్యక్తి ఊరంతా అప్పులు చేసి మరణించినా.. అతడి అంత్యక్రియలకు అక్కడి ప్రజలంతా కదిలి వచ్చి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన అప్పుల గురించి కాకుండా మంచి గురించి మాట్లాడుకుంటూ అతడి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థించారు. ఈ ఘటన మదన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదే స్టోరీ లైన్ తీసుకుని ఆయన ఓ కథ తయారు చేసుకున్నాడు. డబ్బు కన్నా మానవతా విలువలు ప్రధానం అని చెప్పేలా స్టోరీ రాసుకున్నాడు. దానికి అంతిమయాత్ర అనే పేరు పెట్టాడు.
ఈ స్టోరీతో సీరియల్ తియ్యొచ్చని ఈటీవీకి పంపించాడు. వారు దాన్ని తిరస్కరించారు. అదే కథను కాస్త డెవలప్ చేసి భాగ్యరాజా దగ్గరకు తీసుకుపోయాడు. ఆయన తెలుగు, తమిళ్లో తానే తీస్తానని చెప్పాడు. ఈ సినిమాకు మోహన్ బాబు అయితే బాగుంటుందన్నాడు. ఆ తర్వాత ఈ స్టోరీని ప్రకాష్ రాజుకు చెప్తే కథ బాగున్నా సినిమాగా పనికిరాదంటూ నో చెప్పాడు. ఆ తర్వాత స్నేహితుడైన డైరెక్టర్ చంద్ర సిద్దార్థ్కు మదన్ ఈ కథ వినిపించాడు. కథ నచ్చి తనే ఈ సినిమాను నిర్మిస్తానని చెప్పి, ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ కథ వినిపించారు. ఆయన ఎంతో భావోద్వేగానికి గురై కంట తడి పెట్టుకున్నారు. ఈ సినిమాలలో తాను నటిస్తానని మాటిచ్చాడు.
హీరోయిన్గా ఆమని, సంగీత దర్శకుడిగా ఆర్పీ పట్నాయక్ ఓకే అయ్యారు. సినిమా టైటిల్ను అంతిమయాత్ర నుంచి ‘ఆ నలుగురు’గా మార్చారు. ఈ సినిమా విడుదలైన తరువాత ప్రేక్షకుల నుంచి ఎంతో ఆదరణ పొందింది. రాజేంద్ర ప్రసాద్ నటన, ఆయన మాటలు ప్రతి ప్రేక్షకుడి హృదయాన్ని కదిలించాయి. వారి మనసులోతుల్లోకి చేరాయి. అందరినీ ఆలోచింపజేశాయి. ఈ చిత్రం ఎన్నో అవార్డులను దక్కించుకుని ఇండస్ట్రీ రికార్డు నెలకొల్పింది.