చరణ్ - సుక్కు మళ్ళీ కలవబోతున్నారట...!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘రంగస్థలం’ సినిమా ఎంతటి ఘన విజయాన్ని చేసుకుందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత చరణ్ - సుక్కు మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. దీంతో సుకుమార్ కోసం రామ్ చరణ్ ఓ సాయం చేయడానికి ముందుకు వచ్చారని వార్తలు వినపడుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం సుకుమార్ బన్నీతో పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఈ సినిమా కోసం సుకుమార్ అండ్ టీమ్ చాలా కష్టపడి చాలా విషయాలు సేకరించారట. అందులో కొంత భాగాన్ని మాత్రమే ‘పుష్ప’ సినిమాలో ఉపయోగిస్తున్నారట. మిగిలిన స్టోరీని ఉప కథలుగా మలిచి వెబ్ సిరీస్ చేయాలని లెక్కల మాస్టర్ సుక్కు భావించారట. దీనికోసం రామ్ చరణ్ ని భాగం కావాలని సుకుమార్ కోరాడట. రామ్ చరణ్ - సుకుమార్ కలిసి ఈ వెబ్ సిరీస్ నిర్మించనున్నారట.
ఇప్పటికే కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్ లో 'ఖైదీ 150' ' సైరా నరసింహా రెడ్డి' సినిమాలను నిర్మించిన రామ్ చరణ్ 'ఆచార్య' సినిమాను నిర్మిస్తున్నాడు. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి హీరోగా మలయాళ సినిమా 'లూసిఫర్'ని తెలుగులో రీమేక్ చేయనున్నాడు. ఇప్పుడు తాజాగా వెబ్ సిరీస్ నిర్మాణంలోకి దిగనున్నాడట. అంతేకాకుండా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ లో తనకు తెలిసిన వ్యక్తి ద్వారా ఇప్పుడు సుకుమార్ వెబ్ సిరీస్ చేయడానికి చర్చలు జరిగేలా చరణ్ చొరవ చూపుతున్నారని వార్తలు వినపడుతున్నాయి. ఈ లాక్ డౌన్ పూర్తి అయిన వెంటనే షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందట. థియేటర్లు పూర్తి స్థాయిలో ఓపెన్ కాకముందే ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తే మంచి లాభాలు వస్తాయనే నమ్మకంతో అమెజాన్ ప్రైమ్ ఉందట. మరి ఈ వార్తలపై సుక్కు అండ్ టీమ్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.