తమిళంలో రీమేక్ కానున్న అల... వైకుంఠపురములో.. హీరో ఎవరంటే ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన అల... వైకుంఠపురములో.. ఈ సంక్రాంతికి విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. దాదాపు 150కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం టాలీవుడ్ లో బాహుబలి సిరీస్ తరువాత అత్యధిక కలెక్షన్స్ ను రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇక ఈ చిత్రం ఇప్పుడు కోలీవుడ్ లో రీమేక్ కానుందట. శివ కార్తికేయన్ ఈ చిత్రంలో హీరోగా నటించే అవకాశాలు ఉన్నాయని కోలీవుడ్ మీడియా వెల్లడించింది. ప్రస్తుతం శివ కార్తికేయన్ ,నెల్సన్ డైరెక్షన్ లో డాక్టర్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాను కంప్లీట్ చేశాక అల.. రీమేక్ ను మొదలు పెట్టనున్నాడు. త్వరలోనే  ఈ రీమేక్ గురించి మరిన్ని వివరాలు  వెలుబడనున్నాయి.
 
ఇక  అల... వైకుంఠపురములో తమిళ్ తోపాటు హిందీలో కూడా రీమేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇప్పటికే  ఒరిజినల్ వెర్షన్  సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ లోకి రాగ  మే 1న టీవి ప్రీమియర్ కూడా ప్రదర్శితం కానుందని సమాచారం. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించగా థమన్ సంగీతం అందించాడు. గీతా ఆర్ట్స్ , హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ల పై అల్లు అరవింద్ , రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించారు.
 
ఈ సినిమా ఇచ్చిన విజయం తో అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని తెలుగు తోపాటు, మలయాళ, కన్నడ , తమిళ్, హిందీ భాషల్లో విడుదలచేయనున్నాడు. అందులో భాగంగా  ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ డైరెక్షన్ లో  పుష్ప లో నటించడానికి రెడీ అవుతున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ  రష్మిక మందన్న కథానాయికగా నటించనుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: