బ్లాక్ బాస్టర్ కాంబినేషన్ నందమూరి నటసింహం బాలకృష్ణ - మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల కలయికలో మూడో సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో వున్న ఈచిత్రం ఫిబ్రవరి 15నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ చిత్రం లో సీనియర్ హీరో శ్రీకాంత్ ను విలన్ గా ఫైనల్ చేశారని సమాచారం. అలాగే సునీల్ ఈ సినిమాలో కమెడియన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవల కమెడియన్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన సునీల్ కు ఇంతవరకు సరైన బ్రేక్ రాలేదు. అరవింద సమేత , చిత్రలహరి , అల.. వైకుంఠపురములో ,డిస్కో రాజా ఇలా అన్ని చెప్పుకోదగ్గ చిత్రాల్లో నటించినా సునీల్ కు మాత్రం ఈసినిమాల వల్ల వచ్చిందేం లేదు. మరి ఈ సారి బోయపాటి అయినా సునీల్ కు గుర్తిండిపోయే పాత్ర ఇస్తాడో లేదో చూడాలి.
భారీ బడ్జెట్ తో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనున్న ఈచిత్రానికి థమన్ సంగీతం అందించనున్నాడు. ఇక గత ఏడాది ఏకంగా మూడు సినిమాలతో భారీ డిజాస్టర్ లను చవిచూశాడు బాలకృష్ణ. అందులో భాగంగా గత సంక్రాంతి కి ఎన్టీఆర్ కథానాయకుడు తో రాగ ఆచిత్రం ఘోర పరాజయం చెందింది . ఆతరువాత ఎన్టీఆర్ మహానాయకుడు కూడా అదే ఫలితాన్ని రిపీట్ చేయగా చివర్లో రూలర్ తోవచ్చి మరో సారి దారుణంగా దెబ్బ తిన్నాడు.
దాంతో ఇప్పుడు బాలయ్య , బోయపాటి పైనే ఆశలు పెట్టుకున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహ , లెజెండ్ సూపర్ హిట్లు కావడంతో ఈ మూడో సినిమా పై కూడా మంచి అంచనాలు వున్నాయి. దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదలచేయడానికి ప్లాన్ చేస్తున్నారు.