ఎట్టకేలకు శర్వానంద్ దగ్గర ఆగిన మహాసముద్రం....
ఆర్ ఎక్స్ 100 సినిమా ద్వారా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి. చాలా తక్కువ బడ్జెట్ లో రూపొందిన ఆర్ ఎక్స్ 100 మంచి విజయం సాధించింది. అప్పటి వరకు తెలుగు సినిమాల్లో ఎవరూ చూపించని ఒక అంశాన్ని తెరమీద చూపించి ప్రేక్షకుల నుండి హిట్ అనిపించుకున్నాడు. అయితే అజయ్ భూపతి ఆర్ ఎక్స్ 100 తర్వాత మళ్ళీ మరో సినిమా చేయలేదు.
తన తర్వాతి చిత్రంగా మహాసముద్రం అనే టైటిల్ ని ఖరారు చేసిన్ అజయ్, ఆ సినిమా ఎవరితో చేయాలా అని ఆలోచించి, రవితేజతో ఫిక్స్ అయ్యాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా రవితేజ చేయడంలేదని తెలిసింది. రవితేజ సినిమా ఒప్పుకోకపోవడంతో ఆ స్క్రిప్టు మరో హీరో దగ్గరికి వెళ్ళింది. ఎవరి దగ్గరికి వెళ్ళినా కథ బాగుందని అంటున్నారు కానీ, వారికి ఉన్న వేరే కమిట్ మెంట్ ల వల్ల సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది.
అయితే తాజాగా ఈ సినిమా నాగచైతన్య దగ్గరికి కూడా వచ్చింది. నాగచైతన్య కి కథ బాగా నచ్చిందట. సమంత ఇందులో నటిస్తే బాగుంటుందని సలహా కూడా ఇచ్చాడట. కానీ, నాగచైతన్య ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఒక సంవత్సరం వరకు ఆగమని చెప్పాడట. దాంతో వేరే హీరోల వేటలో పడిన అజయ్ భూపతి ఆ కథని శర్వానంద్కి వినిపించాడు. రణరంగంతో పాటు మరో చిత్రం చేయడానికి ఒప్పందం చేసుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్ వంశీ దగ్గరకు శర్వానంద్ ఈ కథ పంపించాడు.
ఈ చిత్రానికి బడ్జెట్ ఎక్కువ అవసరం అవుతుంది కనుక శర్వానంద్ ఇటీవలి సినిమాల ఫలితాలు దృష్టిలో వుంచుకుని దీనిని మల్టీలింగ్వల్గా చేద్దామని డిసైడ్ అయ్యారు. తమిళ నటుడు ఎవరితో అయినా మరో ముఖ్య పాత్ర చేయించి ద్విభాషా చిత్రంగా తెరకెక్కించాలని భావిస్తున్నారు మరి ఇంతమంది హీరోల చుట్టు తిరిగిన ఈ కథ ప్రేక్షకులని ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.