జయలలిత బయోపిక్ లకు రంగం సిద్దం..
ఈ మద్య అన్ని సినీ పరిశ్రమల్లో బయోపిక్ మూవీలు వస్తున్నాయి. తెలుగు లో మహానటి, ఎన్టీఆర్ బయోపిక్, యాత్ర ఈ మద్య జార్జిరెడ్డి వచ్చింది. బాలీవుడ్ లో చారిత్రక నేపథ్యంలో పలు సినిమాలు వచ్చాయి. సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా సంజు, ప్రధాని మోదీ, బాల్ థాకరే ఇలా ఎన్నో మూవీస్ వచ్చాయి. అయితే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నటి జయలలిత చనిపోయి రెండేళ్లు దాటేసినా ఇప్పటికీ ఆమె స్మరణంలోనే ఉన్నారు అభిమానులు. ఆమె జీవిత కథ ఆధారంగా బయోపిక్ వస్తుందని చాలా మంది భావించారు. కానీ ఆమె జీవితంపై బయోపిక్ తీయాలంటే ధైర్యం చేయాల్సిందే అన్న విషయం తెలిసిందే.
జయలలిత మరణం తర్వాత ఒక సంవత్సరం పాటు తమిళ నాట రాజకీయ సంక్షోభం ఏర్పడింది. అంతే కాదు జయలలిత బయోపిక్ తీసేందుకు రెడీ అయినా.. సినిమాలు, వెబ్ సిరీస్లపై జయలలిత మేనకోడలు దీప అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. మద్రాస్ హైకోర్టులో కేసు కూడా వేశారు. ఈ కేసును విచారించిన కోర్టు దీప పిటిషన్ను కొట్టివేసింది. ఇవన్నీ పక్కన బెట్టి ఇప్పుడు జయలలిత బయోపిక్ లు ఒకటి కాదు రెండు కాదు మూడు రెడీ అవుతున్నాయి. ఇప్పుడు రెండు సినిమాలు, ఓ వెబ్ సిరీస్ దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్నాయి.
తెలుగు, తమిళ, హిందీ బాషల్లో ‘తలైవి’ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇక, అమ్మ పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తుండగా.. లెజెండ్రీ తమిళనాడు దివంగత రాజకీయ నాయకుడు ఎం.జి.రామచంద్రన్(ఎంజీఆర్) పాత్రలో అరవిందస్వామి నటిస్తున్నారు. ఈ మూవీకి ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తుండగా.. విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్. సింగ్ నిర్మిస్తున్నారు. అలాగే నిత్యామీనన్తో ప్రియదర్శిని `ఐరన్ లేడి` అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు సినిమాలే కాకుండా రమ్యకృష్ణ టైటిల్ పాత్రలో గౌతమ్ మీనన్, మురుగేశన్ దర్శకత్వంలో క్వీన్ అనే వెబ్ సిరీస్ తెరకెక్కింది.