సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, ఎంపీ గల్లా జయదేవ్ కొడుకు గల్లా అశోక్ హీరోగా రూపొందనున్న డెబ్యూ సినిమా ఈ ఆదివారం ప్రారంభమైంది. హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా పూజాకార్యక్రమాలు నిర్వహించి సినిమాను లాంచ్ చేశారు. హీరో హీరోయిన్లు అశోక్, నిధి అగర్వాల్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్లాప్నిచ్చారు. మరో హీరో రానా దగ్గుబాటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ స్క్రిప్ట్ను దర్శక నిర్మాతలకు అందించారు.
ఈ కార్యక్రయంలో గల్లా కుటుంబ సభ్యులు రామచంద్రనాయుడు, అరుణ కుమారి, జయదేవ్, పద్మావతితో పాటు నటుడు వీకే నరేశ్, కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే, టీడీపీ ఎంపీలు కేశినేని నాని, కింజారపు రామ్మోహన్ నాయుడు కూడా విచ్చేశారు. అయితే సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటంతో మహేష్ మాత్రం ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు.
ఇక, 'భలే మంచి రోజు', 'శమంతకమణి', 'దేవదాస్' సినిమాతో మంచి దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం సమకూరుస్తున్నారు. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ, గల్లా అరుణ కుమారి సమర్పణలో అమర రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్పై గల్లా పద్మావతి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నిధీ నటిస్తున్న ఇదే. ఇక ఈ సినిమాకి నిధీకి రెమ్యూనరేషన్ భారీగా ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంతకముందే దిల్ రాజు బ్యానర్ లో అశోక్ సినిమా లాంచ్ అయింది. కానీ అనూహ్యంగా దిల్ రాజు ఆ ప్రాజెక్ట్ ని ఆపేశాడు. అదే స్క్రిప్ట్ ని యంగ్ హీరో రాజ్ తరుణ్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరి లోకం ఒకటే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో షాలిని పాండే హీరోయిన్ గా నటిస్తోంది.