ప్రస్తుతం ఏపీలో టిడిపి, వైసిపి మధ్య గట్టి యుద్ధం నడుస్తోంది. ఓవైపు చంద్రబాబు మరో వైపు జగన్ గెలుపు పై ఎవరి ధీమా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇక జగన్ అయితే మంత్రి పదవులు కూడా ఇచ్చేస్తున్నారు. అంటే తానే గెలుస్తానని అంత బలంగా నమ్ముతున్నారు. ఇదే తరుణంలో చంద్రబాబు నాయుడు కాస్త లోలోపల గుబులు పడుతున్నట్టు తెలుస్తోంది. అంటే ఆయన మీది మీదికి ఏదో అలా మన ప్రభుత్వం రాబోతుందని చెబుతున్నారు కానీ పైన పటారం లోనే లొటారం అన్నట్టు ఆయన బాడీ లాంగ్వేజ్ మాట తీరు చూస్తే మాత్రం లో లోపల మదన పడుతున్నట్టు తెలుస్తోంది.
చంద్రబాబు ప్రజాబలం పేరుతో ఇప్పటికే ఎన్నో సభలు తిరుగుతూ ప్రతి సభలో మాట్లాడుతున్నారు. అయితే ఏ సభలో మాట్లాడినా ఆయన అధికారంలోకి వస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తానో చెప్పకుండా ఎవ్రీ టైం జగన్ ను మాత్రమే టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఇప్పటికి ఆయన మేనిఫెస్టో కూడా రిలీజ్ అయింది. మేనిఫెస్టో లో ఉన్న ఏ అంశం గురించి కూడా ఎక్కువగా ప్రజలకు హామీ ఇవ్వడం లేదు. ఎప్పుడు చూసినా జగన్ అలా చేసాడు జగన్ ఇలా చేశాడు, జగన్ ని దించేయాలి మనం బాగుపడాలి అంటూ మాట్లాడుతున్నారు. ఆయన ఇలా మాట్లాడడానికి ప్రధాన కారణం మేనిఫెస్టోలో ఉన్న పథకాలే అని తెలుస్తోంది.
రాష్ట్రంలో అమలు చేయలేని హామీలను చంద్రబాబు మేనిఫెస్టోలో చేర్చారు. ఒకవేళ అధికారంలోకి వస్తే అవి చేయడం కుదురుతుందా.. బడ్జెట్ సరిపోతుందా లేదా అనేది ఆయన మదన పడుతున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవంలో ఏనాడూ కూడా ఎన్నికల్లో తాను తప్పక గెలుస్తానని చెప్పాడు తప్ప ఈ విధంగా గుబులు పడుతూ మదన పడుతూ మాట్లాడిన దాఖలాలైతే లేవు. కానీ ఈ ఎన్నికల్లో అవి కనిపిస్తున్నాయి. ఆయన ఎంత ఒత్తిడితో ఉన్నారో స్పష్టంగా అర్థమవుతుంది. గెలుపు ఎవరికి దక్కుతుందో తెలియదు కానీ చంద్రబాబు మాత్రం అంత ఆనందంగా లేరు అనేది మాత్రం జగమెరిగిన సత్యం.