మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చిత్రం సైరా నరసింహారెడ్డి అభిమానుల అంచనాలను అందుకోలేకపోయిందా..? తొలి స్వాతంత్ర్య సమరమోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను తెరకెక్కించడంలో దర్శకుడు సురేందర్రెడ్డి విఫలం చెందారా..? బిగ్బి అమితాబ్బచ్చన్, నయనతార, తమన్నా, జగపతిబాబు, కిచ్చా సుదీప్,మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి వంటి భారీ తారగణం నటించినా హిట్ను అందుకోలేకపోయిందా..? ఈ పరిస్థితుల్లో బాక్సాఫీస్ దగ్గర సినిమా బోల్తాపడినట్టేనా అంటే.. తాజా టాక్ మాత్రం ఔననే అంటోంది. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ నిర్మాణ సారథ్యంలో దర్శకుడు సురేందర్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా సైరా నరసింహారెడ్డిని తెరకెక్కించారు.
తొలి స్వాతంత్ర్య సమరయోధుడిగా గుర్తింపు పొందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కించిన ఈ బయోగ్రఫీ మెగా అభిమానుల అంచనాలను అందుకోలేకపోయిందనే టాక్ బలంగా వినిపిస్తోంది. అయితే.. ఈ విషయం మాత్రం మెగా అభిమానులకు ఏమాత్రం రుచించదు కానీ.. ఈ సినిమాలో చిరంజీవి నటన మాత్రం అద్భుతంగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.
అరవై ఏళ్ల వయస్సులోనూ ఎనర్జిటిక్గా కనిపించిన తీరుతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. నిజంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఇలాగే ఉంటారా..? అనే భావన అందరిలో కలుగుతుంది. అయితే.. సినిమాలోని అన్ని పాత్రల మధ్య లింక్ సరిగ్గా కుదరలేదనే టాక్ వినిపిస్తోంది. అయితే.. బాహుబలి, సాహో లాంటి సినిమాలతో తెలుగు సినిమా ఇప్పుడు ప్రపంచస్థాయిని అందుకుంది. తెలుగు ప్రేక్షకులు కూడా ప్రతీ సినిమాను అదే స్థాయిలో ఊహించుకుంటున్నారు. ఇక అభిమానులు కూడా తమ హీరో సినిమా అనగానే.. భారీగా ఊహించుకుంటున్నారు. సమస్యంతా ఇక్కడే ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది.
సినిమాను సినిమా తీరుగా చూడకుండా.. ఎవరికివారుగా అంచనాలు పెంచుకోవడం సరికాదని పలువురు అంటున్నారు. నిజానికి.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత్ర ఆధారంగా రూపొందించిన సైరా నరసింహారెడ్డి చిత్రం విషయంలోనూ ఇదే జరిగిందని, ఒక స్వాతంత్య్ర సమరమోధుడి పోరాటాన్ని తెరపై చూపించడం మామూలు విషయం కాదని చెబుతున్నారు. కల్పితకథలైతే.. అనేక ఎలిమెంట్స్ చూపించవచ్చునని, కానీ.. ఒక యోధుడి జీవిత చరిత్రను అలా ఇష్టారీతిన మార్చుకోవడం సాధ్యం కాదని, ఈ విషయాన్ని ప్రేక్షకులు కూడా గమనించాలని పలువురు సూచిస్తున్నారు.