ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు కోలీవుడ్ అండ్ శాండిల్ వుడ్ ఇలా అన్ని వుడ్ ల నిర్మాతల చూపు తెలుగు సినిమాలపై పడింది. ఈ మధ్య ఇక్కడ హిట్టైన సినిమాలని హిందీలోకి రీమేక్ చేయడానికి ఉత్సాహం చూపుతున్నాయి అక్కడి నిర్మాణ సంస్థలు. ఇప్పటికే 'అర్జున్ రెడ్డి' రీమేక్ భారీ హిట్టై వసూళ్ల వర్షం కురిపించడంతో ఇంకొన్ని తెలుగు సినిమాల హక్కుల్ని హిందీ నిర్మాతలు కొనిపెట్టుకున్నారు. వాటిలో 'జెర్సీ, ఆర్ఎక్స్100' ఎవడు సినిమాల రైట్స్ ను కొనేశారు. అలాగే సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ క్రేజీ బ్యూటీ రష్మిక మండన్న రెండవ సారి జంటగా వచ్చిన 'డియర్ కామ్రేడ్' చిత్రం యొక్క హిందీ రీమేక్ రైట్స్ ను ప్రముఖ బాలీవుడ్ చిత్ర నిర్మాత కరణ్ జోహార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
కాగా తాజా సమాచారం ప్రకారం మరొక తెలుగు చిత్రాన్ని కూడా హిందీలోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని టాక్. అది కూడా రీసెంట్ హిట్ అయిన బ్రోచెవారెవరురా చిత్రమని తెలుస్తోంది. కాగా ఈ చిత్రంతో పాటు ఓ బేబీ కూడా రీమేక్ కానుందట. నిజానికి ఓ బేబీ సౌత్ కొరియన్ సినిమా 'మిస్ గ్రానీ'. ఈ సినిమాని తెలుగులో 'ఓ బేబీ' పేరుతో రీమేక్ చేశారు సమంత. ఈ చిత్రాన్ని నందిని రెడ్డి డైరెక్ట్ చేశారు. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. దీంతో రానా సినిమా హక్కులు ఎలాగూ తమ సురేష్ ప్రొడక్షన్స్ చేతిలోనే ఉన్నాయి కాబట్టి హిందీలోకి కూడా రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారు. సమంత చేసిన పాత్రలో అలియా భట్ ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలతో పాటు మరో చిత్రం కూడా రీమేక్ రైట్స్ అమ్ముడుపోయిందట. అయితే ఆ చిత్రం ఏమిటనేది మాత్రం ఇంకా బయటికిరాలేదు. కొందరు నాగ చైతన్య చేసిన 'మజిలీ' అంటుంటే ఇంకొందరు దేవరకొండ చేసిన 'గీత గోవిందం' అంటున్నారు. మరి పక్కా సమాచారం తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు ఆగాల్సిందే. మొత్తానికి తెలుగు కథలకు డిమాండ్ మాములుగా లేదుగా.